వినాయక చవితికి సెలవు లేదు.. ఏపీ సర్కారు నిర్ణయంపై..
ABN , First Publish Date - 2021-08-26T17:13:33+05:30 IST
ఈ ఏడాది సెప్టెంబరు 10న జరిగే వినాయక చవితికి ప్రభుత్వం బ్యాంకులకు సెలవును రద్దు చేసింది. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ప్రకారం సెలవు ఇవ్వాలి.
‘చవితి’కి బ్యాంకులకు సెలవు రద్దు..
ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగుల మండిపాటు
విజయవాడ, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది సెప్టెంబరు 10న జరిగే వినాయక చవితికి ప్రభుత్వం బ్యాంకులకు సెలవును రద్దు చేసింది. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ప్రకారం సెలవు ఇవ్వాలి. గడచిన ఏడాది వరకు ఇది కొనసాగింది. పొరుగున తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది కూడా వినాయక చవితికి సెలవును ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సెలవు ప్రకటించలేదు. దీనిపై బ్యాంకు ఉద్యోగులు మండిపడుతున్నారు. బుధవారం యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. దీనికి తెలంగాణలో బ్యాంకులు విడుదల చేసిన సెలవుల క్యాలెండర్ను జత చేసింది. బ్యాంకు యూనియన్స్ రాసిన లేఖపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నదానిపై ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.