కోవిడ్ కారణంతో పాఠశాలలను మూసివేయడంలో ఔచిత్యం లేదు : ప్రపంచ బ్యాంకు నిపుణుడు

ABN , First Publish Date - 2022-01-17T00:14:49+05:30 IST

కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో పాఠశాలలను మూసివేయడంలో

కోవిడ్ కారణంతో పాఠశాలలను మూసివేయడంలో ఔచిత్యం లేదు : ప్రపంచ బ్యాంకు నిపుణుడు

న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో పాఠశాలలను మూసివేయడంలో ఔచిత్యం లేదని ప్రపంచ బ్యాంకు గ్లోబల్ ఎడ్యుకేషన్ విభాగం డైరెక్టర్ జైమే సావేడ్ర చెప్పారు. కొత్త ప్రభంజనాలు వచ్చినప్పటికీ పాఠశాలలను మూసేయడమనేది చిట్టచివరి నిర్ణయంకావాలన్నారు. పాఠశాలలను పునఃప్రారంభించడం వల్ల కరోనా వైరస్ కేసులు పెరిగాయని, పాఠశాలలు సురక్షిత ప్రదేశాలు కాదని చెప్పడానికి తగిన ఆధారాలు లేవన్నారు. 


జైమే సావేడ్ర బృందం విద్యా రంగంపై కోవిడ్-19 ప్రభావాన్ని అధ్యయనం చేస్తోంది. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సావేడ్ర మాట్లాడుతూ, బాలలకు టీకాలు ఇచ్చే వరకు వేచి చూడాలనడంలో అర్థం లేదని చెప్పారు. ఈ దృక్పథానికి సైన్స్‌పరమైన ఆధారమేదీ లేదన్నారు. పాఠశాలలను తెరవడం, కరోనా వైరస్ వ్యాపించడం మధ్య సంబంధం లేదన్నారు. ఈ మహమ్మారి పేరుతో  పాఠశాలలను మూసివేయడంలో ఔచిత్యం లేదన్నారు. కొత్త ప్రభంజనాలు వచ్చినప్పటికీ పాఠశాలలను మూసేయడమనేది చిట్టచివర తీసుకోవలసిన నిర్ణయం కావాలన్నారు. బార్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్‌ను తెరచి ఉంచి, పాఠశాలలను మూసివేయడంలో అర్థం లేదన్నారు. ఇది సరైనది కాదన్నారు. 


2020లో మన సముద్ర యానం అయోమయంగా, అగమ్యగోచరంగా ఉండేదన్నారు. కోవిడ్ మహమ్మారితో ఎలా పోరాడాలో, ఏది మంచి విధానమో అప్పట్లో తెలియదన్నారు. వెంటనే చాలా దేశాల నుంచి వచ్చిన ప్రతిస్పందన పాఠశాలలను మూసేయాలనేనని చెప్పారు. ఆ తర్వాత చాలా కాలం గడిచిందని, 2020, 2021లలో అనేక ప్రభంజనాలు వచ్చాయని, ఆధారాలు లభించాయని తెలిపారు. అదేవిధంగా చాలా దేశాల్లో పాఠశాలలను తెరిచారని చెప్పారు. 


పాఠశాలలను తెరవడం వల్ల వైరస్ వ్యాప్తిపై ప్రభావం పడుతోందా? అనే అంశాన్ని పరిశీలించగలిగామని చెప్పారు. అటువంటిదేమీ లేదని తాజా సమాచారం చెప్తోందన్నారు. చాలా దేశాల్లో పాఠశాలలను మూసివేసిన సమయంలో కూడా కోవిడ్ ప్రభంజనాలు వచ్చాయన్నారు. దీనినిబట్టి చూసినపుడు కొన్ని ప్రభంజనాల్లో పాఠశాలల పాత్ర లేదని స్పష్టమవుతోందన్నారు. 


బాలలు ఇన్ఫెక్షన్‌కు గురయ్యే అవకాశం, ఒమైక్రాన్ సోకే అవకాశం ఉన్నప్పటికీ, మరణాలు, తీవ్రమైన అస్వస్థత సంభవించే పరిస్థితులు అత్యంత అరుదు అని చెప్పారు. బాలలకు ప్రమాదాలు చాలా తక్కువ అని, పాఠశాలల మూసివేత వల్ల పర్యవసానాలు చాలా తీవ్రమైనవని తెలిపారు. 


Updated Date - 2022-01-17T00:14:49+05:30 IST