వందలాది స్కూళ్లలో టీచర్ల నిరసన
ABN , First Publish Date - 2022-01-20T06:31:32+05:30 IST
రివర్స్ పీఆర్సీపై ఉద్యమ జోరు రెండోరోజు బుధవారం కూడా కొనసాగింది. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పలు సంఘాల నాయకులు ఆందోళన బాట పట్టారు.
తగ్గని ఉద్యమ జోరు..
మోకాళ్లపై నిలబడి
ఏపీఎన్జీఓ, జేఏసీ అమరావతి నేతలు..
ఆడిట్ ఉద్యోగులు, ఇతర నేతలు సైతం..
రెండోరోజూ అదే వేడి
అనంతపురం విద్య, జనవరి 19: రివర్స్ పీఆర్సీపై ఉద్యమ జోరు రెండోరోజు బుధవారం కూడా కొనసాగింది. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పలు సంఘాల నాయకులు ఆందోళన బాట పట్టారు. జిల్లావ్యాప్తంగా నిరసనలు తెలిపారు. ఎక్కడిక్కడ నల్లబ్యాడ్జీలు ధరించి, పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఫోర్టో ఆధ్వర్యంలో జిల్లాలోని స్కూళ్లలో నిరసన తెలిపారు. వెంటనే జీఓలు రద్దు చేయాలనీ, హెచఆర్ఏ స్లాబును యథాతథంగా కొనసాగించాలనీ, ఫిట్మెంట్ పెంచాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిల్లాలోని అనంతపురం, ధర్మవరం, పామిడి, గుత్తి, కళ్యాణదుర్గం, అనంతపురం రూరల్ తదితర మండలాల్లోని జిల్లా పరిషత, ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో టీచర్ల నిరసనలు తెలిపారు. డీ హీరేహాళ్ మండలంలో సమగ్రశిక్ష ప్రాజెక్టు పరిధిలో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులు సైతం నల్లబ్యాడ్జీలు ధరించి, నిరసన వ్యక్తం చేశారు. పెనకచెర్ల ఎస్సీ కాలనీలోని స్కూల్లో టీచర్లు ఖాళీ ప్లేట్లతో వి నూత్న ఆందోళన చేపట్టారు. జడ్పీలోని జిల్లా ఆడిట్ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో తొలిసారి నిరసన తెలిపారు. ఈ నిరసనలో ఆడిట్ ఉద్యోగులు నరసింహమూర్తి, సుందర్రాజు, హేమంత, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.
మోకాళ్లపై ఆందోళన
అనంతపురం నగరంలోని హంద్రీనీవా కార్యాలయం వద్ద ఏపీఎన్జీఓల సంఘం, ఏపీజేఏసీ అమరావతి నాయకులు పెద్దఎత్తున ఆందోళన చేశారు. మోకాళ్లపై నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం వెంటనే జీఓలు రద్దుచేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏపీజేఏసీ నగర చైర్మన్ మనోహర్రెడ్డి, ఏపీ జేఏసీ అమరావతి జిల్లా ఎన్జీఓల చైర్మన్ దివాకర్రావు, ఫ్యాప్టో జిల్లాప్రధానకార్యదర్శి సాలవేముల బాబు, నాయకులు ఉమాశంకర్, శ్రీనివాసులు, వెంకటరమణారెడ్డి, రామాంజనేయులు, ఇరిగేషన్ ఉద్యోగులు మహబూబ్ దౌలా, రామకృష్ణ, రాజేష్ పాల్గొన్నారు
మరో ఉద్యమానికి ఉద్యోగులు సన్నద్ధం..!
నేడు రాష్ట్రస్థాయిలో అత్యవసర సమావేశం
హాజరుకానున్న ఏపీజేఏసీ
అమరావతి జిల్లా నాయకులు.
అనంతపురం వ్యవసాయం, జనవరి 19: రివర్స్ పీఆర్సీకి వ్యతిరేకంగా ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు మరో ఉద్యమానికి సన్నద్ధమవుతున్నారు. ఉద్యోగులకు సంతృప్తికరమైన పీఆర్సీతోపాటు పెండింగ్ డీఏలు, ఇతర రకాల సమస్యలపై గతేడాది డిసెంబరు 7 నుంచి 21వతేదీదాకా పలు రూపాల్లో నిరసనలు చేపట్టారు. నల్లబ్యాడ్జీలు ధరించి, విధులకు హాజరవడంతోపాటు ప్ర భుత్వ మొండివైఖరిని వ్యతిరేకిస్తూ రోడ్లెక్కి నిరసన వ్యక్తం చేశారు. అప్పట్లో ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో నిరసనలు విరమించారు. రివర్స్ పీఆర్సీ ఉత్తర్వులు ఇవ్వడంతోపాటు సీపీఎస్, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను ఎటూ తేల్చలేదు. దీనిపై ఆయా ఉద్యోగవర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇదేక్రమంలో ఏపీజేఏసీ నాయకులు ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొం డిగా ముందుకెళితే ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని ఇప్పటికే రాష్ట్ర సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఉద్యమ కార్యాచరణపై చర్చించేందుకు ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర నేతలు గురువారం విజయవాడలో అత్యవసర సమావేశం నిర్వహించనున్నా రు. జిల్లా నాయకులు హాజరుకానున్నారు. బుధవా రం రాత్రి ఏపీజేఏసీ అమరావతి జిల్లా చైర్మన దివాకర్రావు, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ తదితరులు విజయవాడ బయలుదేరి వెళ్లారు. సమావేశం లో రాష్ట్ర నాయకత్వం నిర్ణయాల మేరకు జిల్లా వ్యా ప్తంగా అన్ని కార్యాలయాల్లో ఉద్యమ కార్యాచరణ అ మలు చేస్తామని ఏపీజేఏసీ అ మరావతి చైర్మన దివాకర్రావు పేర్కొన్నారు.
పీఆర్సీతో జీతాల్లో కోత దుర్మార్గం
సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఓబులు.. కలెక్టరేట్ ఎదుట ధర్నా
అనంతపురం కార్పొరేషన, జనవరి19: రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ అమలు ద్వారా ఉద్యోగులు జీతాలు పెంచాల్సిందిపోయి, కోతపెట్టడం దుర్మార్గమని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఓబులు విమర్శించారు. బుధవారం మున్సిపల్ యూనియన రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లా యూనియన ప్రధాన కార్యదర్శి నాగభూషణం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికలు.. స్థానిక కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. కార్యక్రమానికి ఓబులు హాజరై, మాట్లాడారు. టీడీపీ హయాంలో మధ్యంతర భృతి 27 శాతం ఇస్తే, వైసీపీ పాలకులు అంతకన్నా తక్కువ 23 శాతం ఫిట్మెంట్ ఇవ్వడం దారుణమన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాల్సిందిపోయి.. కోత పెట్టేవిధంగా ఫిట్మెంట్ ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. హెచఆర్ఏలో కోత విధిస్తూ జీఓ ఇవ్వడంతో కార్మికుల నిజ వేతనాలు తగ్గిపోయే పరిస్థితి నెలకొందన్నారు. వెంటనే ఆ జీఓను సవరించాలని డిమాండ్ చేశారు. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలోనూ కార్మికులు ప్రాణాలు లెక్కచేయకుండా పనిచేశారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం.. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. అనంతరం కలెక్టరేట్ ఏఓకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఆర్వీ నాయుడు, వెంకటేష్, మున్సిపల్ యూనియన నేతలు లక్ష్మీనారాయణ, రమణ, తిరమలేష్ పాల్గొన్నారు.
నేడే కలెక్టరేట్ ముట్టఢీ..!
ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల నుంచి భారీ స్పందన
ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిరసనలు
మద్దతు తెలిపిన ఫోర్టో, ఇతర ఉపాధ్యాయ సంఘాలు
ఏపీజేఏసీ, ఏపీజేఏసీ అమరావతి, ఇతర సంఘాలు సైతం..
5 వేల నుంచి 8 వేల మంది వచ్చే చాన్స్
ఖాకీల నిఘా.. రాత్రికిరాత్రే పలువురు అదుపులోకి..
అనంతపురం విద్య, జనవరి 19: రివర్స్ పీఆర్సీపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, సంఘాల నేతలు పెద్దఎత్తున జిల్లా కలెక్టరేట్ను గురువారం ముట్టడించనున్నారు. ముట్టడికి 8 వేల మంది వరకూ తరలిరానున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వంపై ఉద్యోగులు కొంతకాలంగా ఫైర్ అవుతున్నారు. పీఆర్సీ జీఓలను చూసిన తర్వాత తీవ్ర ఆక్రోశంతో రగిలిపోతున్నారు. ఏ ఉద్యోగిని కదిలించినా భగ్గుమంటున్నాడు. దీంతో కలెక్టరేట్ ముట్టడికి సుమారు 80 నుంచి 100 సంఘాల వరకూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెనన్షర్ల, కులసంఘాల నుంచి మద్దతు లభించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అసంతృప్తి, ఆగ్రహంతో రలిగిపోతున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉద్యమవేడితో సర్కారుకు సెగ పుట్టించేందుకు సిద్ధమయ్యారు. దీంతో వేలాదిమంది జిల్లాకేంద్రానికి చేరుకుని, తమ నిరసనాగ్రహాన్ని ప్రభుత్వానికి చూపేందుకు సిద్ధమయ్యారు. బుధవారం సాయంత్రం పోలీసులు సైతం సంఘాల నాయకులను పిలిపించి, మాట్లాడినట్లు సమాచారం. ముట్టడిపై పోలీసులు నిఘా వేయడంతో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు సైతం వ్యూహాత్మకంగా 4 అంచెలతో కదలి కదం తొక్కనున్నట్లు తెలుస్తోంది.
వేలాదిమంది రోడ్డుపైకి...
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై అన్నివర్గాల ఉద్యోగులు తీవ్ర సంతృప్తిలో ఉన్నారు. ఈ క్ర మంలో ఫ్యాప్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్ను ముట్టడించనున్నారు. ముట్టడికి ఫో ర్టో కూడా మద్దతు తెలిపింది. ఈ రెండు సంఘాల పరిధిలోనే ఉపాధ్యాయ సంఘా లు రమారమి 40 ఐక్యంగా పోరాటానికి సిద్ధమయ్యాయి. ఉపాధ్యాయులే ఏకంగా 5 వేల మందిదాకా జిల్లా కేంద్రానికి తరలిరానున్నట్లు సమాచారం. వేలాదిమంది రోడ్లపైకి వచ్చి, కలెక్టరేట్ ముట్టడిలో పాల్గొననున్నట్లు తెలిసింది. ఏపీజేఏసీ, ఏపీజేఏసీ అమరావతి, ఏపీఎన్జీఓలు, పెన్షనర్తు, ఇతర సంఘాల ఆధ్వర్యంలో మరో 3 వేల మంది వరకూ ఉద్యోగులు ముట్టడికి తరలిరానున్నట్లు సమాచారం.