ఇక ఫేస్లెస్ ఐటీ అప్పీళ్లు
ABN , First Publish Date - 2020-09-26T06:34:07+05:30 IST
ఆదాయ పన్ను (ఐటీ) శాఖ మరో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. ఫేస్లెస్ అప్పీళ్ల వ్యవస్థను శుక్రవారం నుంచి అమల్లోకి తెచ్చింది...
న్యూఢిల్లీ : ఆదాయ పన్ను (ఐటీ) శాఖ మరో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. ఫేస్లెస్ అప్పీళ్ల వ్యవస్థను శుక్రవారం నుంచి అమల్లోకి తెచ్చింది. దీంతో ఐటీ వివాదాలపై అప్పీల్కు వెళ్లే వ్యక్తులు, సంస్థలు ఇక ఐటీ ఆఫీసుల చుట్టూ లేదా అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. అధికారులు అడిగే పత్రాలు లేదా వారు అడిగే ప్రశ్నలకూ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇక ఇదంతా ఆన్లైన్లోనే నడిచిపోతుంది. ఐటీ శాఖ ఇప్పటికే ఫేస్లెస్ పద్ధతిలో పన్నుల మదింపు, నోటీసుల జారీ, వివరాల సేకరణ చేపట్టింది. ఫేస్లెస్ అప్పీళ్ల వ్యవస్థతో ఐటీ శాఖ పనితీరులో మరింత పారదర్శకత ఏర్పడనుంది. అయితే కొన్ని అంశాలు ఫేస్లెస్ అప్పీళ్ల పరిధిలోకి రావని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.
- తీవ్ర మోసాలతో ముడిపడిన కేసులు
- పెద్ద ఎత్తున పన్ను ఎగవేత కేసులు
- సున్నితమైన, సోదాలతో ముడిపడిన కేసులు
- నల్లధన చట్టం, అంతర్జాతీయ పన్నుల కేసులు