తబ్లిగి కేసు: సీబీఐ దర్యాప్తు అవసరం లేదన్న కేంద్రం

ABN , First Publish Date - 2020-06-05T19:46:53+05:30 IST

దేశ రాజధానిలోని నిజాముద్దీన్ ఏరియాలో ఇటీవల జరిగిన తబ్లిగి జమాత్ సదస్సు కేసుపై సీబీఐ దర్యాప్తు అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం..

తబ్లిగి కేసు: సీబీఐ దర్యాప్తు అవసరం లేదన్న కేంద్రం

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని నిజాముద్దీన్ ఏరియాలో ఇటీవల జరిగిన తబ్లిగి జమాత్ సదస్సు కేసుపై సీబీఐ దర్యాప్తు అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు శుక్రవారంనాడు తెలియజేసింది. దేశంలో కోవిడ్-19 వ్యాప్తికి తబ్లిగి సదస్సు కేంద్రస్థానం కావడం ఇటీవల సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో కేంద్రం ఒక అఫిడవిడ్ దాఖలు చేసింది. ఈ అంశంపై చట్టప్రకారం రోజువారీ దర్యాప్తు జరుపుతున్నామని, నిర్దిష్ట కాలవ్యవధిలో ఇందుకు సంబంధించిన నివేదికను కూడా కోర్టుకు సమర్పిస్తామని ఆ అఫిడవిట్‌లో కేంద్రం తెలియజేసింది.


ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ పోలీసుల తప్పిదాల కారణంగానే తబ్లిగీ జమాత్ సదస్సు చోటుచేసుకుందని, దీనిపై సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలని సుప్రియ పండిత అనే పిటిషనర్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై కేంద్ర తాజా అఫిడవిట్ దాఖలు చేసింది. అక్రమంగా నగదు లావాదేవీలకు జమాతే ట్రస్టు పాల్పడిందంటూ అందిన ఫిర్యాదు మేరకు తబ్లిగి జమాత్, మరికొందరు గుర్తుతెలియని వ్యక్తులపై సీబీఐ గత వారంలో ప్రాథమిక విచారణ కూడా జరిపింది. మరోవైపు, మార్చిలో జరిగిన ఈ సదస్సుకు హాజరైన పలువురు విదేశీయులపై ఢిల్లీ పోలీసులు పలు ఛార్జిషీట్లు నమోదు చేశారు. తబ్లిగీ జమాత్ చీఫ్ మౌలానా సాద్‌పై పలు ఐపీసీ సెక్షన్ల కింద, డిజాస్టర్ మేనేజిమెంట్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్‌లు కూడా నమోదు చేశారు.

Updated Date - 2020-06-05T19:46:53+05:30 IST