ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయంపై కేంద్రం స్పష్టీకరణ

ABN , First Publish Date - 2021-12-01T17:43:13+05:30 IST

సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన నిరసన

ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయంపై కేంద్రం స్పష్టీకరణ

న్యూఢిల్లీ : సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన నిరసన కార్యక్రమాల సందర్భంగా రైతుల మరణాలకు సంబంధించిన రికార్డు లేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ బుధవారం పార్లమెంటుకు తెలిపారు. ఈ మూడు సాగు చట్టాలను పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభం రోజునే (సోమవారం) రద్దు చేసిన సంగతి తెలిసిందే. 


సుమారు ఓ సంవత్సరం నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పోరాడుతున్నారని, వీరిలో కొందరు రైతులు మరణించారని, వారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేసే ఆలోచన ఉందా? అని ప్రభుత్వాన్ని ప్రతిపక్షం ప్రశ్నించింది. దీనిపై నరేంద్ర సింగ్ తోమర్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ వద్ద దీనికి సంబందించిన రికార్డు లేదని, అందువల్ల మరణించిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించడమనే ప్రశ్న తలెత్తదని తెలిపారు. 


ఇదిలావుండగా రైతు సంఘాలు చెప్తున్నదాని ప్రకారం, 2020 నవంబరు నుంచి ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘు, టిక్రి, ఘాజీపూర్‌ వద్ద రైతులు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నిరసనల్లో పాల్గొన్నవారిలో 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. తట్టుకోలేని వాతావరణం, అపరిశుభ్ర పరిసరాల వల్ల అనారోగ్యానికి గురికావడం, ఆత్మహత్యల వల్ల ఈ మరణాలు సంభవించాయి. 


మూడు సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినప్పటికీ రైతు సంఘాలు తమ నిరసనలను కొనసాగిస్తున్నాయి. వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించడంపై చట్టబద్ధమైన హామీ ఇవ్వాలని, నిరసనల నేపథ్యంలో తమపై పెట్టిన కేసులను ఉపసంహరించాలని, నిరసనల్లో మరణించిన రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. తమ డిమాండ్లు నెరవేరే వరకు నిరసనలను కొనసాగిస్తామని చెప్తున్నాయి. 


Updated Date - 2021-12-01T17:43:13+05:30 IST