ఐపీఎల్ 2020 అప్డేట్స్: స్టేడియంలోకి మీడియాకు నో ఎంట్రీ
ABN , First Publish Date - 2020-09-19T21:52:30+05:30 IST
ఐపీఎల్ 2020లో భాగంగా తొలి మ్యాచ్ ఇవాళ రాత్రి 7.30 గంటలకు మొదలకానుంది. ఈ మ్యాచ్లో...
అబుదాబి: ఐపీఎల్ 2020లో భాగంగా తొలి మ్యాచ్ ఇవాళ రాత్రి 7.30 గంటలకు మొదలకానుంది. ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు, ముంబై ఇండియన్స్ జట్టు తలపడనున్నాయి. అబుదాబిలోని షేక్ జాయేద్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. కొవిడ్ నిబంధనల కారణంగా ఈసారి ఐపీఎల్లో మీడియాకు అనుమతి లేదని బీసీసీఐ ప్రకటించింది. మామూలుగానైతే ఆయా జట్ల ప్రాక్టీస్ను కవర్ చేయడానికి.. ప్రెస్మీట్లకు మీడియా ప్రతినిధులకు నేరుగా అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు కరోనా కారణంగా భౌతిక దూరం పాటించాల్సి రావడంతో ముందు జాగ్రత్తగా వారిని అనుమతించడం లేదని బోర్డు వెల్లడించింది.
మ్యాచ్లకు ముందు ఆయా ఫ్రాంచైజీలు ప్రెస్ కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని, మ్యాచ్ ముగిశాక మాత్రం వర్చువల్ మీడియా సమావేశాలు తప్పనిసరిగా ఉంటాయని తెలిపింది. ‘ఆటగాళ్ల ఆరోగ్య భద్రతా కారణాల రీత్యా మీడియా వ్యక్తులను స్టేడియాల్లోకి లేదా ప్రాక్టీస్ సెషన్ల కవరేజ్కు అనుమతించడం లేదు. యూఏఈ మీడియా మినహా మరే మీడియా రిజిస్ట్రేషన్లకు కూడా అనుమతి లేదు. మ్యాచ్లు ముగిశాక అప్డేట్స్ను ప్రెస్ నోట్స్ ద్వారా అందిస్తాం’ అని బీసీసీఐ వెల్లడించింది.