వలస జీవుల ఉపాధి వెతలు.. పనులు దొరక్క అవస్థలు

ABN , First Publish Date - 2020-09-19T19:08:50+05:30 IST

జిల్లా నుంచి వలస కూలీలుగా, కార్మికులుగా, వ్యాపారులుగా, చిన్నపెద్ద ప్రైవేటు సంస్థల ఉద్యోగులుగా 2లక్షల మంది వరకు ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారు. కరోనా నేపథ్యంలో ఐదారు నెలల క్రితమే లక్షన్నర కుటుంబాలు స్వగ్రామాలకు చేరాయి.

వలస జీవుల ఉపాధి వెతలు.. పనులు దొరక్క అవస్థలు

తిరిగి పని ప్రదేశాలకు వెళ్లలేక స్థానికంగా పనులు దొరక్క అవస్థలు

ప్రైవేటు ఉద్యోగులదీ అదే దుస్థితి ఠ జిల్లాలో లక్ష కుటుంబాలకుపైనే


ఒంగోలు (ఆంధ్రజ్యోతి) : జిల్లా నుంచి వలస కూలీలుగా, కార్మికులుగా, వ్యాపారులుగా, చిన్నపెద్ద ప్రైవేటు సంస్థల ఉద్యోగులుగా 2లక్షల మంది వరకు ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారు. కరోనా నేపథ్యంలో ఐదారు నెలల క్రితమే లక్షన్నర కుటుంబాలు స్వగ్రామాలకు చేరాయి. వీరిలో అత్యధికులు రోజువారీ వేతన జీవులే. ఆరు మాసాలు గడుస్తున్నా కరోనా తీవ్రత తగ్గకపోగా మరింత ఉధృతమైంది. ప్రైవేటు సంస్థల్లో పనిచేసే చాలామందికి ఉద్యోగాలు ఊడిపోయాయి. ప్రస్తుతం వారంతా జీవనోపాధి దొరక్క తీవ్ర అవస్థలు పడుతున్నారు. వేసవిలో ఉపాధి పనులకు అత్యధికులు వెళ్లగా ప్రస్తుతం వర్షాలతో ఆ పనులూ సాగడం లేదు. వ్యవసాయ పనులు అంతగా లేవు. వలస కూలీలు స్థానికంగా అరకొరగా దొరికే నిర్మాణ రంగం, వ్యవసాయ, ముఠా పనులకు వెళ్లి కుటుంబాలను అర్ధాకలితో నెట్టుకొస్తున్నారు. 


జిల్లాలో వలస కూలీలు, ప్రైవేటు ఉద్యోగులను కరో నా కష్టాలు వెం టాడుతున్నాయి. వైరస్‌ విస్తృతి నే పథ్యంలో సొంత గ్రామాలకు వచ్చి ఆరు మాసాలు గడుస్తున్నా తిరిగి పని ప్రదేశాలకు వెళ్లలేక, స్థానికంగా పనులు దొరక్క అత్యధికులు అవస్థలు పడుతున్నారు. కొంతమంది అందుబాటులో ఉన్న పనులకు వెళ్లి వచ్చే అరకొర రాబడితో కుటుంబాలను పోషిస్తున్నారు. జిల్లాలో ఈ తరహా సుమారు లక్ష కుటుంబాలకుపైగా ఉన్నట్లు అంచనా. వీరిలో సొంత ఇళ్లకు చేరిన తర్వాత కరోనా సోకిన వారి సంఖ్య అధికంగానే ఉంది. 


నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో భవన నిర్మాణ సంస్థలలో పనిచేసే వారు వంద మంది, ఇతర పనులు చేసేవారు మరో 200 మంది వరకూ బయట ప్రాంతాల్లో ఉంటూ కరోనా సమయంలో సొంత ఊళ్లకు వచ్చారు. వారిలో నాల్గో వంతు మంది కూడా తిరిగి పని ప్రదేశాలకు వెళ్లలేక, స్థానికంగా పనులు దొరక్క అవస్థలు పడుతున్నారు. అదే మండలంలోని టి.అగ్రహారంలోనూ ఇదే పరిస్థితే ఉంది. 


బల్లికురవ మండలం అంబడిపూడిలో సుమారు వంద మంది కొన్నేళ్లుగా చెక్‌డ్యాంలు, సైడు కాలువలు నిర్మాణాలకు రేకులు పెట్టే పనులు చేస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ  ప్రాంతాలకు వెళ్లి ఆ పనులు చేసేవారు. నెలవారీ సగటున రూ.40వేల నుంచి 50వేల రాబడి పొందేవారు. అలాంటిది ఆరు నెలలుగా ఆ పనులు నిలిచిపోయాయి. ఈ కారణంగా దాదాపు రెండు వేల పైచిలుకు ఇనుప రేకులు గ్రామంలోనే నిరుపయోగంగా ఉన్నాయి. పనులు లేక వారంతా అవస్థలు పడుతున్నారు. 


కందుకూరు, కొండపి, కనిగిరి ప్రాంతాలలో అడపాదడపా వ్యవసాయ పనులు, గ్రామాల్లో మట్టిరోడ్డు పనులు, ప్రభుత్వ భవన నిర్మాణ పనులకు అక్కడక్కడా వెళ్తున్నారు. వలస కూలీలు, ప్రైవేటు ఉద్యోగుల్లో ఎక్కువ మంది వేసవిలో ఉపాధి పనులకు వెళ్లారు. ఇప్పుడు వర్షాలతో అవి సాగక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 


ఒక రోజు పని ఉంటే మరో రోజు దొరకడం లేదు: మల్లెల గోపి, టి. అగ్రహారం,ఎన్‌జీపాడు మండలం 

బేల్దారి పనులు చేసుకుంటూ హైదరాబాద్‌లో ఉండే వాళ్లం. అన్నం పెట్టి ఏడాదికి లక్షన్నర రూపాయలు ఇచ్చే వారు. కుటుంబం సాఫీగా నడిచిపోయేది. కరోనాతో మార్చి ఆఖరులో స్వగ్రామానికి వచ్చాం. ఆరు నెలలైంది. అక్కడ పనులు సరిగ్గా ప్రారంభం కాక వెళ్లలేకపోయాం. ఇక్కడ ఒక రోజు పని ఉంటే మరో రోజు దొరకడం లేదు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.


కుటుంబం గడవటం కష్టంగా ఉంది: పల్లపు అంకమరాజు, అంబడిపూడి, బల్లికురవ మండలం 

మా గ్రామంలో దాదాపు వంద మంది కూలీలు వివిధ ప్రాంతాల్లో చెక్‌డ్యాంలు, సైడ్‌ కాలువల నిర్మాణాలకు రేకులు పెట్టే పనులు చేసేవాళ్లం. నెలకు కనీసం రూ.40వేల రాబడి వచ్చేది. కరోనాతో ఆరు నెలలుగా ఆ పనులు దొరకడం లేదు. ఊర్లో చేసుకొనేందుకు పనులు లేవు. ఇప్పుడు కుటుంబాలు గడవటం కష్టంగా ఉంది.

Updated Date - 2020-09-19T19:08:50+05:30 IST