రాత్రి 9 దాటితే అంతే!
ABN , First Publish Date - 2021-10-13T05:43:35+05:30 IST
- రాజాం బస్టాండ్లో సోమవారం రాత్రి 10 గంటల సమయంలో పాలకొండ వెళ్లే బస్సు కోసం ఓ మహిళ నిరీక్షిస్తోంది. అంతలోనే ఓ బస్సు వచ్చి అగింది. కొందరు ప్రయాణికులు దిగారు. దీంతో ఆ మహిళ చేతిలో బరువైన లగేజీతో బస్సు ఎక్కగా... ‘వెనుక మరో బస్సు వస్తోంది..అందులో రండి’ అంటూ డ్రైవర్ చెప్పాడు. ఎందుకని ఆమె ప్రశ్నించింది. బస్సులో కండక్టర్ లేరు. టిక్కెట్ ఇచ్చేందుకు వీలులేదని అతను చెప్పడంతో ఆమె షాక్కు గురయ్యారు. అక్కడికి అర్ధగంట దాటిన తరువాత మరో బస్సు వచ్చింది. ఆ డ్రైవర్ నుంచి కూడా అదే సమాధానం.
ఆగని ఆర్టీసీ బస్సులు
చీకట్లో ప్రయాణికులకు కష్టాలు
కండక్టర్ లేరని బదులిస్తున్న డ్రైవర్లు
(రాజాం రూరల్)
- రాజాం బస్టాండ్లో సోమవారం రాత్రి 10 గంటల సమయంలో పాలకొండ వెళ్లే బస్సు కోసం ఓ మహిళ నిరీక్షిస్తోంది. అంతలోనే ఓ బస్సు వచ్చి అగింది. కొందరు ప్రయాణికులు దిగారు. దీంతో ఆ మహిళ చేతిలో బరువైన లగేజీతో బస్సు ఎక్కగా... ‘వెనుక మరో బస్సు వస్తోంది..అందులో రండి’ అంటూ డ్రైవర్ చెప్పాడు. ఎందుకని ఆమె ప్రశ్నించింది. బస్సులో కండక్టర్ లేరు. టిక్కెట్ ఇచ్చేందుకు వీలులేదని అతను చెప్పడంతో ఆమె షాక్కు గురయ్యారు. అక్కడికి అర్ధగంట దాటిన తరువాత మరో బస్సు వచ్చింది. ఆ డ్రైవర్ నుంచి కూడా అదే సమాధానం. ఈసారి ఆమె బస్సు దిగలేదు. తన భర్త ఆర్టీసీ ఉద్యోగి అని.. పాలకొండ డిపోలో పనిచేస్తున్నారని చెప్పడంతో ప్రయాణానికి అనుమతిచ్చారు. ఈ సమస్య ఆ ఒక్క మహిళదే కాదు.. ఎంతో మంది ప్రయాణికులదీ ఇదే పరిస్థితి. కండక్టర్లు లేకుండా రాత్రివేళ ప్రయాణిస్తున్న బస్సుల్లో ప్రయాణం చేసేందుకు వీలులేక అవస్థలకు గురవుతున్నారు. పాలకొండ డిపో నుంచి 96 సర్వీసులు నడుస్తున్నాయి. ఇందులో 43 సర్వీసులు పాలకొండ-విశాఖ మధ్య నడుస్తున్నాయి. 30 సర్వీసులు కండక్టర్లు లేకుండా నడుస్తున్నట్టు తెలుస్తోంది.
ఆదాయానికి గండి..
కండక్టర్ లేకుండా తిరుగుతున్న బస్సుల వల్ల ప్రయాణికులకు వెతలు తప్పడం లేదు. అదే సమయంలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి పడుతోంది. కండక్టర్ లేని బస్సులకు సంబంధించి టిక్కెట్లు ఇచ్చేందుకు పాలకొండ, రాజాంలో టిమ్ మిషన్ ఆపరేటర్లు (ఔట్సోర్సింగ్ సిబ్బంది) ఉంటారు. పాలకొండలో బస్సు బయలుదేరగానే టిమ్ మిషన్ ఆపరేటర్ ప్రయాణికుల నుంచి టికెట్ వసూలు చేసి పాలకొండ పట్టణ శివార్లలో దిగిపోతారు. ఆపై రాజాం వెళ్లే లోపు సంకిలి, రేగిడి జంక్షన్ తదితర ఏప్రాంతంలో అయినా ప్రయాణికులు వేచి ఉన్నా ఆ బస్సులో ప్రయాణించేందుకు వారికి అవకాశం లేదు. రాజాం పట్టణంలోనిఎర్రచెరువు సమీపాన వేచి ఉండే ప్రయాణికులు కూడా ఈ తరహా బస్సుల్లో ఎక్కేందుకు అవకాశం లేదు. రాత్రి 9 గంటల తరువాత టిమ్ మిషన్ ఆపరేటర్ విధులు ముగించుకొని వెళ్లిపోతున్నారు. ఆ తరువాత రాజాం నుంచి పాలకొండ వెళ్లాల్సిన ప్రయాణికులు కండక్టర్తో వచ్చే బస్సు కోసం నిరీక్షించాల్సిందే. రాకపోతే ఇక్కట్లు పడాల్సిందే. అత్యవసర పరిస్థితుల్లో అయితే వారి బాధలు వర్ణనాతీతం. వాస్తవానికి పాలకొండ డిపోలో సిబ్బంది సరిపడినంత ఉన్నా కండక్టర్ లేని సర్వీసులు తిప్పడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై డిపో మేనేజర్ జీఎస్ఎన్ మూర్తి వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా పూర్తిస్థాయిలో పరిశీలించి... చర్యలు చేపడతామని చెప్పారు.