దాయాదిపై గాలిబుడగల యుద్ధానికి కిమ్ రెడీ!

ABN , First Publish Date - 2020-06-22T23:57:35+05:30 IST

తనకు వ్యతిరేకంగా దక్షిణ కొరియా వైపు నుంచి నిత్యం గాలిబుడగల ద్వారా కరపత్రాలు వెల్లువెత్తుతుండడంతో..

దాయాదిపై గాలిబుడగల యుద్ధానికి కిమ్ రెడీ!

సియోల్: తనకు వ్యతిరేకంగా దక్షిణ కొరియా వైపు నుంచి నిత్యం గాలిబుడగల ద్వారా కరపత్రాలు వెల్లువెత్తుతుండడంతో ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్‌కి చిర్రెత్తుకొచ్చింది. వాటిని పంపుతున్న వారిని నిలువరించాలంటూ పదే పదే చెబుతున్నా దక్షిణ కొరియా పెడచెవిన పెడుతుండడంతో.. దాయాదికి అదే రీతిలో బదులివ్వాలని ఆయన సిద్ధమయ్యారు. దక్షిణ కొరియాలోకి వదిలేందుకు 3 వేల బెలూన్లలో 12 మిలియన్ల కరపత్రాలను నింపి సిద్ధం చేయాలని ఆదేశించారు. ‘‘ప్రతికార శిక్షకు సమయం దగ్గరపడింది..’’ అంటూ ఉత్తర కొరియా మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ‘‘రాజధాని పోంగ్యాంగ్‌లోని ప్రచురణ, ముద్రణ సంస్థలు దక్షిణ కొరియాకు వ్యతిరేకంగా దాదాపు 12 మిలియన్ల కరపత్రాలను ముద్రించేపనిలో ఉన్నాయి. పొరుగుదేశం పట్ల అన్ని వర్గాల ప్రజల్లో గూడుకట్టుకున్న ఆగ్రహావేశాలు, ద్వేషాన్ని ప్రతిబింబిస్తూ వీటిని ముద్రిస్తున్నారు..’’ అని పోంగ్యాంగ్ అధికారిక మీడియా సంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్ఏ) ఓ కథనంలో పేర్కొంది.


అయితే కిమ్ నిర్ణయం పట్ల దక్షిణ కొరియా విచారం వ్యక్తం చేసింది. కరపత్రాలను వదిలే ప్రయత్నాలను విరమించుకోవాలంటూ డిమాండ్ చేసింది. గత వారంలో రెండు దేశాల మధ్య సరిహద్దు పట్టణమైన కైసంగ్‌లోని ఉమ్మడి అనుసంధాన కార్యాలయాన్ని సైతం ఉత్తర కొరియా పేల్చివేసింది. 2018లో ఇరు దేశాల అధినేతలు చర్చలు జరిపిన తర్వాత పరస్పర సహకారం కోసం ఈ భవనాన్ని నిర్మించారు. ఈ సమావేశం సందర్భంగా ఇరుదేశాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ఇరు దేశాలు ఒకరిపై ఒకరు వ్యతిరేక చర్యలకు దిగకూడదు. కానీ సరిగ్గా ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ దక్షిణ కొరియా నుంచి తమపై విద్వేష కరపత్రాలు వదులుతున్నారని ఉత్తర కొరియా ఆరోపిస్తోంది. ఉత్తర కొరియా ప్రతిచర్యలను వ్యతిరేకించేందుకు దక్షిణ కొరియా కూడా 2018 నాటి ఒప్పందాన్ని ఉటంకిస్తుండడం గమనార్హం. 

Updated Date - 2020-06-22T23:57:35+05:30 IST