బ్యాంకులన్నిటినీ ప్రైవేటీకరించబోం : నిర్మల సీతారామన్

ABN , First Publish Date - 2021-03-16T23:33:09+05:30 IST

బ్యాంకు ఉద్యోగులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ భరోసా

బ్యాంకులన్నిటినీ ప్రైవేటీకరించబోం : నిర్మల సీతారామన్

న్యూఢిల్లీ : బ్యాంకు ఉద్యోగులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ భరోసా ఇచ్చారు. బ్యాంకులన్నిటినీ ప్రైవేటీకరించబోమని, ఒకవేళ ఏ బ్యాంకునైనా ప్రైవేటీకరిస్తే, ఆ బ్యాంకులో పని చేసే ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడతామని చెప్పారు. బ్యాంకుల ప్రైవేటీకరణకు తీసుకున్న నిర్ణయం బాగా ఆలోచించిన తర్వాత తీసుకున్నదేనని వివరించారు. బ్యాంకులకు మరింత ఎక్కువ ఈక్విటీ రావాలని, దేశ ప్రజల ఆకాంక్షలను బ్యాంకులు నెరవేర్చాలని తాము కోరుకుంటున్నామన్నారు. 


బ్యాంకుల ప్రైవేటీకరణకు ప్రతిపాదనలు వచ్చిన నేపథ్యంలో తొమ్మిది సంఘాలు సోమ, మంగళవారాల్లో దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్న నేపథ్యంలో నిర్మల సీతారామన్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఏ బ్యాంకునైనా ప్రైవేటీకరిస్తే, ఆ బ్యాంకులో పని చేసే ఉద్యోగుల ప్రయోజనాలకు, జీతాలు, పింఛన్లకు రక్షణ ఉంటుందని చెప్పారు. ప్రస్తుత ఉద్యోగుల ప్రయోజనాలను అన్నివిధాలుగా కాపాడతామన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను కొనసాగిస్తామని, పబ్లిక్ సెక్టర్ ఎంటర్‌ప్రైజ్ పాలసీ ఇదే చెప్తోందని తెలిపారు. బాగా పని చేసే బ్యాంకులు చాలా ఉన్నాయని, పరవాలేదనే విధంగా పని చేస్తున్న బ్యాంకులు కూడా ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం మనకు విస్తృతంగా పని చేయగలిగే బ్యాంకులు కావాలన్నారు. భారతీయ స్టేట్ బ్యాంకు పరిమాణంలో మనకు మరిన్ని బ్యాంకులు అవసరమని చెప్పారు. 


Updated Date - 2021-03-16T23:33:09+05:30 IST