ఒక్క అంగుళం భూమి కూడా వదులుకోం: హిమంత్ బిస్వ శర్మ

ABN , First Publish Date - 2021-07-27T21:48:49+05:30 IST

అసోంలోని అంగుళం భూమిని కూడా పొరుగురాష్ట్రం అక్రమించుకోవడానికి అనుమతించమని..

ఒక్క అంగుళం భూమి కూడా వదులుకోం: హిమంత్ బిస్వ శర్మ

గువాహటి: అసోంలోని అంగుళం భూమిని కూడా పొరుగురాష్ట్రం అక్రమించుకోవడానికి అనుమతించమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత్ బిస్వ శర్మ అన్నారు. అసోం, మిజోరం రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదాలు ముదిరిపాకాన పడటం, సోమవారం కచార్ జిల్లాలో జరిగిన కాల్పుల్లో ఐదుగురు అసోం పోలీసులు మృతిచెందిన నేపథ్యంలో హిమంత్ బిస్వ శర్మ మంగళవారంనాడు మీడియాతో మాట్లాడారు. ఇన్నర్‌లైన్ ఫారెస్ట్ రిజర్వ్‌ విధ్వంసం, దురాక్రమణకు గురికాకుండా రక్షణ కోరుతూ సుప్రీంకోర్టును తమ ప్రభుత్వం ఆశ్రయిస్తుందని చెప్పారు. సిల్చార్‌లో రోడ్లు నిర్మిస్తున్నట్టు, సేద్యం కోసం అడవులను తొలగిస్తున్నట్టు శాటిలైట్ ఫోటోల్లో కనిపిస్తున్నాయని, ఈ చర్యలను ఎంతమాత్రం అనుమతించమని చెప్పారు. ''అది రిజర్వ్ ఫారెస్ట్. సెటిల్‌మెంట్ కోసం రిజర్వ్ ఫారెస్ట్ ఉపయోగించుకోవచ్చా? ఇది స్థలం గురించిన వివాదం కాదు, అటవీ భూములకు చెందినది. అసోం ప్రభుత్వం అడవులను కాపాడుకోవాలని నిశ్చితాభిప్రాయంతో ఉంది'' అని హిమంత్ బిస్వ శర్మ తెలిపారు.


రెండు రాష్ట్రాల మధ్య చిరకాలంగా సరిహద్దు సమస్య ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలోనూ ఈ వివాదం ఉందని శర్మ తెలిపారు. ఇది రెండు రాష్ట్రాల మధ్య సమస్యే కానీ , రాజకీయ పార్టీల మధ్య సమస్య ఎంతమాత్రం కాదని  ఆయన వివరించారు. సోమవారం చోటుచేసుకున్న హింసా ఘటనలో పౌరులకు తుపాకులు ఎక్కటి నుంచి వచ్చాయో విచారణ జరగాలని, ఈ హింసలో ఐదుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారని ఆయన పేర్కొన్నారు. సరహద్దులు కాపాడుకునేందుకు ప్రజలు ప్రాణత్యాగాలకు కూడా వెనుకాడటం లేదని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సరిహద్దులను ప్రభుత్వం కాపాడుకుంటుందని ఆయన చెప్పారు.

Updated Date - 2021-07-27T21:48:49+05:30 IST