వ్యాక్సిన్ కోసం కాదు టోకెన్ల కోసమే!
ABN , First Publish Date - 2021-05-18T06:40:57+05:30 IST
రెండో డోసు వ్యాక్సిన్ వేసుకునేందుకు టోకెన్లకోసం వాక్సినేషన్ సెంటర్ల వద్ద సోమవారం జనం బారులు తీరారు.
రెండో డోసు వ్యాక్సిన్ వేసుకునేందుకు టోకెన్లకోసం వాక్సినేషన్ సెంటర్ల వద్ద సోమవారం జనం బారులు తీరారు. ఏప్రిల్ 12లోపు తొలిడోసు వేసుకున్న వారందరికీ రెండో డోసు టీకాలు వేస్తామని కార్పొరేషన్ అధికారులు ప్రకటించిన నేపథ్యంలో తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ మైదానం, బైరాగిపట్టెడ లోని రామానాయుడు మున్సిపల్ స్కూల్ గ్రౌండ్, ఇందిరా మైదానంతో పాటు పలు హెల్త్ సెంటర్లలో వ్యాక్సిన్ వేసేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ఒకేసారి ఎక్కువమంది గుమికూడుతున్నారనే కారణంతో ముందుగా టోకెన్లు ఇచ్చి, అందులో సూచించిన సమయానికి రావాలని అధికారులు సూచించారు. కొవాగ్జిన్ టీకాకు డిమాండ్ ఉన్న నేపథ్యంలో సోమవారం పలు కేంద్రాల్లో టోకెన్ల కోసం జనం పెద్దఎత్తున చేరుకున్నారు.భౌతికదూరం లేకుండా ఎండను సైతం లెక్కచేయకుండా క్యూలో నిలబడ్డారు.
నేటినుంచి మూడు రోజులు వ్యాక్సిన్ డ్రైవ్
తిరుపతి కార్పొరేషన్ పరిధిలో మంగళ,బుధ, గురువారాల్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ ఏర్పాటు చేశామని కమిషనర్ గిరీష తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్ 12లోపు తొలి డోసు వేసుకున్నవారందరికీ రెండవ డోసు వేస్తామన్నారు. కార్పొరేషన్ పరిధిలో లేనివారు వ్యాక్సిన్ కోసం రావొద్దని కోరారు.ఈ మూడు రోజుల్లో 5,500 వ్యాక్సిన్లు వేయనున్నామని, టోకెన్ తీసుకున్నవారు మాత్రమే వ్యాక్సినేషన్ సెంటర్లకు రావాలన్నారు.ప్రైవేట్ ఆస్పత్రుల్లో తొలిడోసు వేసుకున్నవారి చిరునామాలు తీసుకుని వారి ఇంటివద్దకే టోకెన్లను అందిస్తామని చెప్పారు.