HYD : రోడ్డు ప్రమాదం కాదది హత్యే.. తేల్చేసిన పోలీసులు.. బార్లో మద్యం తాగించి..!
ABN , First Publish Date - 2021-09-12T18:04:16+05:30 IST
అయితే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరిసరాలలోని సీసీ కెమెరాలను...
హైదరాబాద్ సిటీ/చాంద్రాయణగుట్ట : రోడ్డుప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడని భావించిన పోలీసులకు సీసీ కెమెరాలు అసలు నిజాన్ని వెలుగులోకి తెచ్చాయి. ఈనెల 6న రాత్రి కందికల్గేట్ అల్సూర్ కాలనీకి చెందిన విశ్రాంత ఉద్యోగి మహ్మద్ గౌసుద్దీన్(62) కందికల్గేట్ రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద బైక్పై నుంచి కిందపడి అక్కడికక్కడే మృతిచెందిన విషయం విదితమే. అయితే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరిసరాలలోని సీసీ కెమెరాలను పరిశీలించగా మృతుడితోపాటు మరో వ్యక్తి ఉన్నట్టు కనిపించింది.
మృతుడితోపాటు కెమెరాలో కనిపించిన జీఎం ఛావునికి చెందిన సుభాన్ఖాన్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా మహ్మద్ గౌసుద్దీన్ను పథకం ప్రకారమే హత్య చేశానని అంగీకరించాడని ఇన్స్పెక్టర్ అబ్దుల్ ఖాదర్ జిలాని తెలిపారు. సుభాన్ఖాన్ ఈనెల 6న మహ్మద్ గౌసుద్దీన్ను లాల్దర్వాజలోని ఓ బార్కు తీసుకొచ్చి మద్యం తాగించాడు. మద్యం మత్తులో ఉన్న మహ్మద్ గౌసుద్దీన్ను కందికల్గేట్ రైల్వే బ్రిడ్జి ప్రాంతంలో ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బండరాయితో తలపై మోది సుభాన్ఖాన్ పరారయ్యాడు. సీసీ కెమెరాల ద్వారా రోడ్డు ప్రమాదం కాదు హత్య అని నిర్ధారించుకున్న పోలీసులు నిందితుడిని శనివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.