ఎన్‌పీఆర్‌ తిరస్కరణకు తీర్మానం చేయాలి

ABN , First Publish Date - 2020-03-14T06:54:34+05:30 IST

జాతీయ జనాభా రిజిస్టరు (ఎన్‌పీఆర్‌) మొత్తాన్ని తిరస్కరించకుండా 2010 నాటి జాతీయ జనాభా రిజస్టరును అమలు చేస్తామంటే సరిపోదని, మొత్తం ఎన్‌పీఆర్‌ను తిరస్కరిస్తే తప్ప...

ఎన్‌పీఆర్‌ తిరస్కరణకు తీర్మానం చేయాలి

జాతీయ జనాభా రిజిస్టరు (ఎన్‌పీఆర్‌) మొత్తాన్ని తిరస్కరించకుండా 2010 నాటి జాతీయ జనాభా రిజస్టరును అమలు చేస్తామంటే సరిపోదని, మొత్తం ఎన్‌పీఆర్‌ను తిరస్కరిస్తే తప్ప ప్రయోజనం లేదని, ఆ మేరకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలు తమ రాష్ట్ర అసెంబ్లీలలో తీర్మానాలు అమలు చేయాలని మానవ హక్కుల వేదిక (హెచ్‌ఆర్‌ఎఫ్‌) డిమాండ్‌ చేస్తోంది.


ఎన్‌పీఆర్‌, ఎన్‌సీఆర్‌, సీఏఏ మూడూ విడదీయలేనంతగా ఒక దానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఎన్‌పీఆర్‌కి శ్రీకారం చుట్టే పౌరసత్వ(సవరణ)చట్టం,2003 ముఖ్య లక్ష్యం భారత పౌరుల జాతీయ రిజస్టరు (ఎన్‌ఆర్‌సీఐసీ) రూపొందించడం. ఎన్‌పీఆర్‌ ఎలా సేకరించాలో నిర్దేశించే పౌరసత్వ (పౌరుల రిజిస్ర్టేషన్‌, జాతీయ గుర్తింపు కార్డుల మంజూరీ) నియమాలు, 2003లోని 3వ నియమం శీర్షికలోనే ఎన్‌ఆర్‌సీఐసీ ప్రస్తావన ఉంది. ఎన్‌పీఆర్‌ ప్రక్రియ గురించి రూల్‌ 3(4) ప్రస్తావించగా రూల్‌ 3(5) సుస్పష్టంగా చెప్పేదేమంటే ‘జనాభా రిజస్టరు ద్వారా ధృవీకరణ చేసిన తరువాతే భారత పౌరుల రిజిస్టరులో వ్యక్తుల వివరాలు పొందుపరుస్తారు’ అంటే, ఎన్‌పీఆర్‌ మీద ఆధారపడి ఎన్‌ఆర్‌సీను తయారు చేస్తారన్నమాట. మరో మాటలో చెప్పాలంటే ఎన్‌పీఆర్‌, ఎన్‌ఆర్‌సీకి తొలిమెట్టు. 


ఎన్‌పీఆర్‌,ఎన్‌ఆర్‌సీ,సీఏఏలు ఏ క్రమంలో వచ్చాయో అర్థం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పార్లమెంటులో, బైటా చాలా స్పష్టంగా చెబుతున్నారు. ఎన్‌సీఆర్‌ విధానంలో ఒక వ్యక్తి పౌరసత్వం ‘డౌట్‌ఫుల్‌’ లేదా ‘డీ’ అని గుర్తించే ప్రసక్తి లేదని పార్లమెంట్‌లో మార్చి 12న పచ్చి అబద్ధం ఆడారు. పౌరసత్వ నియమాలలోని రూల్‌ 4(4) చెబుతున్నది ఏమిటంటే ‘ధృవీకరణ చేసేటప్పుడు వ్యక్తుల పౌరసత్వం అనుమానాస్పదం(డౌట్‌ఫుల్‌)గా ఉన్నట్లు అనిపిస్తే దాన్ని నమోదు చేసేటప్పుడు ఈ విషయమై విచారణ జరపాలి అనే విషయాన్ని సూచిస్తూ జనాభా రిజస్టరులో తగిన విధంగా గుర్తు పెట్టాలి. ఆ వ్యక్తి లేదా కుటుంబానికి ఆ విషయం ఒక ప్రొఫార్మా ద్వారా వెంటనే తెలియజేయాలి’.


ఎన్‌పీఆర్‌ సర్వే చేపట్టేది ఎన్‌ఆర్‌సీ వివరాల సేకరణ కోసమేనని హెచ్‌ఆర్‌ఎఫ్‌ నమ్ముతుంది. ‘డౌట్‌ఫుల్‌’ పౌరులను గుర్తించడానికి ఎన్‌పీఆర్‌ వివరాలు వాడుకుంటారు. దాని ఆధారంగా ఎన్‌ఆర్‌సీని రూపొందిస్తారు. ఈ ఎన్‌ఆర్‌సీని అడ్డం పెట్టుకుని పాలకులు తమకు గిట్టని వ్యక్తులజీవితాలతో చెలగాటమాడే అవకాశముంది. ఇది కేవలం మత మైనారిటీల సమస్య మాత్రమే అని ఇతరులది కాదు అన్నది ఒక భ్రమ. ఈ సమస్య దేశంలోని అశేష బడుగు బలహీన వర్గాలకు చుట్టుకోనుంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కేరళను ఆదర్శంగా తీసుకుని తమ రాష్ట్రంలో ఎన్‌పీఆర్‌ను బేషరతుగా తిరస్కరించాలని, తమ రాష్ట్రంలో దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయబోమని అసెంబ్లీలలో తీర్మానాలు చేయాలని హెచ్‌ఆర్‌ఎఫ్‌ డిమాండ్‌ చేస్తోంది. 

వి.ఎస్‌.కృష్ణ, ఎస్‌. జీవన్‌ కుమార్‌

హెచ్‌ఆర్‌ఎఫ్‌, ఏపీ & టీఎస్‌ సమన్వయ కమిటీ సభ్యులు

Updated Date - 2020-03-14T06:54:34+05:30 IST