ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేల్లో చీలిక!

ABN , First Publish Date - 2021-06-14T19:38:40+05:30 IST

కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ స్పీకర్‌ ఎన్నిక కోసం సమయం

ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేల్లో చీలిక!

  • మనసులు కలవని ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ - బీజేపీ.. చీలిక!


చెన్నై/అడయార్‌ : కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ స్పీకర్‌ ఎన్నిక కోసం సమయం సమీపిస్తున్నా ఎన్‌డీఏ కూటమిలోని ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ - బీజేపీ ఎమ్మెల్యేల మధ్య ఇంకా సఖ్యత కుదిరినట్టు కనిపించడం లేదు. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి రాష్ట్ర 15వ కొత్త సభ ఈ నెల 16వ తేదీ ఉదయం 9.30 గంటలకు కొలువుదీరనుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసౌ సౌందర్‌రాజన్‌ కూడా సమ్మతం తెలిపారు. ఆ రోజునే కొత్త సభాపతి ఎన్నిక జరుగనుంది. ఇందుకోసం అసెంబ్లీ కార్యదర్శి 15వ తేదీన నోటిఫికేషన్‌ జారీచేయనున్నారు. అయితే, ఈ పదవికి ఒకరి కంటే ఎక్కువమంది అభ్యర్థులు పోటీపడిన పక్షంలో ఎన్నిక నిర్వహించనున్నారు. అలా కాకుండా, ఒక్క అభ్యర్థి మాత్రమే నామినేషన్‌ దాఖలు చేస్తే మాత్రం ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించనున్నారు. నిన్నమొన్నటివరకు స్పీకర్‌ అభ్యర్థిగా ఏంబలం సెల్వం పేరు బాగా వినిపించింది. 


కానీ, ఆయన పేరును బీజేపీ ఇంకా అధికారపూర్వకంగా ప్రకటించలేదు. దీంతో పలువురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీతో టచ్‌లోకి వచ్చినట్టు తెలుస్తోంది. శాసనసభ స్పీకరుగా ఉమ్మడి అభ్యర్థిని నిలపాలని వారు కోరుతున్నారు. అలా కానీ పక్షంలో ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ తరపునే స్పీకర్‌ అభ్యర్థిగా ఒకరిని పోటీకి నిలపాలని వారు కోరుతున్నట్లు సమాచారం. ఇదిలావుంటే, పుదుచ్చేరి శాసనసభకు కేంద్ర ప్రభుత్వం నామినేట్‌ చేసిన ముగ్గురు నామినేటెడ్‌ ఎమ్మెల్యేల్లో ఒకరి పేరును బీజేపీ నేతలు తాజాగా తెరపైకి తెచ్చారు. నామినేటెడ్‌ ఎమ్మెల్యేలను సభాపతిగా అంగీకరించే ప్రసక్తే లేదని స్వతంత్ర ఎమ్మెల్యేలతో పాటు ఇతర ఎమ్మెల్యేలు తేల్చి చెబుతున్నారు.


ఈ నేపథ్యంలో ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌, డీఎంకే, స్వతంత్ర ఎమ్మెల్యేలు సమావేశమై చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ - బీజేపీ నేతల మనస్సులు కలవడం లేదు. ఈ కారణంగానే అసెంబ్లీ ఫలితాలు వెల్లడైన నెలన్నర రోజులు కావస్తున్నా మంత్రివర్గం ఏర్పాటు ఇప్పటికీ సాధ్యపడటం లేదు. పైపెచ్చు, ఉప ముఖ్యమంత్రి పదవి కోసం బీజేపీ పట్టుబడుతోంది. అదేసమయంలో హోంమంత్రి పదవిని బీజేపీ సీనియర్‌ నేత నమశ్శివాయంకు కేటాయించాలని కోరుతున్నారు. దీనికి ముఖ్యమంత్రి ఎన్‌.రంగస్వామి ససేమిరా అంటున్నారు. ఈ కారణంగానే ఇరు పార్టీల మధ్య మనస్పర్థలు ఇంకా కొనసాగుతున్నాయి. 

Updated Date - 2021-06-14T19:38:40+05:30 IST