ఎన్‌ఆర్ఐ సంబంధం.. అల్లుడు కూతురిని విదేశాలకు తీసుకెళతాడనుకుంటే చివరికి జరిగింది ఇదీ..

ABN , First Publish Date - 2021-10-22T03:08:48+05:30 IST

తమ బిడ్డకు ఎన్‌ఆర్ఐని భర్తగా తెచ్చామనుకుని సంబరపడిపోయిన ఓ కుటుంబానికి ఆ సంబరం ఎంతోకాలం నిలవలేదు.

ఎన్‌ఆర్ఐ సంబంధం.. అల్లుడు కూతురిని విదేశాలకు తీసుకెళతాడనుకుంటే చివరికి జరిగింది ఇదీ..

ఇంటర్నెట్ డెస్క్: తమ బిడ్డకు ఎన్‌ఆర్ఐని భర్తగా తెచ్చామనుకుని సంబరపడిపోయిన ఓ కుటుంబానికి ఆ సంబరం ఎంతోకాలం నిలవలేదు. తనతో పాటూ భార్యను విదేశాలకు తీసుకెళతాడనుకున్న అల్లుడు..చిట్టచివరికి హ్యాండ్ ఇవ్వడంతో  ఆ కుటుంబం ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో కూరుకుపోయింది. 


పంజాబ్ రాష్ట్రం హోషియార్‌పూర్‌కు చెందిన పూనమ్ అనే యువతికి ఈ ఏడాది ఏప్రిల్‌లో గౌరవ్ షైనీ అనే యువకుడితో పెళ్లి జరిగింది. మార్చిలోనే వారికి ఈ సంబంధం గురించి తెలిసిందే. అయితే..సెలవులు తక్కువగా ఉన్నాయంటూ గౌరవ్ కుటుంబసభ్యులు పూనమ్ తరపు వారిపై ఒత్తిడి తెచ్చి దగ్గర్లోనే ముహూర్తం పెట్టించుకున్నారు. అయితే..పెళ్లికి సరిగ్గా పది రోజులు ఉందనగా పూనమ్ కుటుంబసభ్యులకు ఓ భారీ షాక్ తగిలింది. గౌరవ్‌కు అంతకుమునుపే మరో యువతితో పెళ్లి నిశ్చయమైందని తెలిసిన వారు..గౌరవ్‌ కుటుంబాన్ని నిలదీశారు. 


అయితే.. జాతకాలు కలవకపోవడంతో పెళ్లి రద్దు చేసుకోవాల్సి వచ్చిందని వారు చెప్పుకొచ్చారు. దీంతో.. వధువు తరపు వారు తమను తాము సర్దిచెప్పుకుని చివరకు పెళ్లికి అంగీకరించారు. ఆ తరువాత.. కొద్ది రోజుల పాటు అంతా సవ్యంగానే సాగింది. తమ తాహతుకు తగ్గట్టు పూనమ్ తల్లిదండ్రులు అన్ని రకాల లాంఛనాలు ఇచ్చుకున్నారు. అన్నీ పుచ్చుకున్న తరువాత గౌరవ్, అతడి తల్లిదండ్రులు మళ్లీ కట్నం కోసం వేధింపులు మొదలెట్టారు. ఈ క్రమంలో ఓ రోజు అల్లుడు పూనమ్‌ను ఆమె తల్లిదండ్రుల వద్ద దిగబెట్టి చెప్పాపెట్టకుండా విదేశాలకు వెళ్లిపోయాడు. ఆ తరువాత.. అతడి నుంచి ఎటువంటి సమాచారం అందలేదు. గౌరవ్ ఎక్కడి కెళ్లాడన్న విషయం కూడా చెప్పేందుకు అతడి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో.. మోసపోయామని తెలుసుకున్న బాధితులు చివరికి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Updated Date - 2021-10-22T03:08:48+05:30 IST