తెలంగాణ రైతన్న కోసం లండన్‌లో NRI టీఆర్ఎస్ మహా ధర్నా

ABN , First Publish Date - 2021-11-21T13:19:47+05:30 IST

టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం వెంటనే కొనుగోలు చెయ్యాలని డిమాండ్ చేస్తూ ఎన్నారై టీఆర్ఎస్ యూకే శాఖ లండన్‌లో భారత హై కమీషన్ ముందు తెలంగాణ రైతన్న కోసం మహా ధర్నా నిరనస కార్యక్రమం నిర్వహించింది.

తెలంగాణ రైతన్న కోసం లండన్‌లో NRI టీఆర్ఎస్ మహా ధర్నా

కేసీఆర్ మహా ధర్నా ద్వారే  కేంద్రంలో మార్పు వచ్చిందన్న ఎన్నారైలు  

లండన్ : టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం వెంటనే కొనుగోలు చెయ్యాలని డిమాండ్ చేస్తూ ఎన్నారై టీఆర్ఎస్ యూకే శాఖ లండన్‌లో భారత హై కమీషన్ ముందు తెలంగాణ రైతన్న కోసం మహా ధర్నా నిరనస కార్యక్రమం నిర్వహించింది. అలాగే వరి ధాన్య సేకరణ విధి విధానాలను కూడా కేంద్రం వెంటనే ప్రకటించాలని కోరింది. ఈ సందర్భంగా ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి మాట్లాడుతూ.. నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం లండన్‌లో ఇలాంటి నిరసన కార్యక్రమాలని ఎన్నారై తెరాస నిర్వహించిందని గుర్తు చేశారు. పోరాటాలు మాకు కొత్త కాదని, గతంలో పసుపు బోర్డు ఏర్పాటుకు కూడా ఇక్కడే నిరసన చేశామని పేర్కొన్నారు. 


నేడు ధాన్యం కొనుగోలులో కేంద్రం వైఖరితో రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందని, ధాన్యం కొనుగోలుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అనేక సార్లు ఢిల్లీ వెళ్లి  రైతుల గోసను వివరించారని తెలిపారు. పంజాబ్‌లో మాదిరిగానే తెలంగాణ రైతులు పండించే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారన్నారు. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిశారని, కానీ ఎలాంటి స్పందన లేదని చెప్పారు. ఈ వేదిక నుండి కేంద్ర ప్రభుత్వాన్ని వెంటనే తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని, అలాగే వారి ధాన్య సేకరణ విధి విధానాలను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.


ఎన్నారై టీఆర్ఎస్ అధికార ప్రతినిధి రవి ప్రదీప్ పులుసు మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఎఫ్‌సీఐకి ఆదేశాలు ఇవ్వాలని కేసీఆర్ తన లేఖలో ప్రధానిని కోరినట్లు ఆయన పేర్కొన్నారు. 2020-21 ర‌బీలో మిగిలిన 5 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యం కొనుగోలు చేయాల‌ని విన‌తి చేశారన్నారు. 2021-22 ఖ‌రీఫ్‌లో 40 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యం కూడా కొనుగోలు చేయాల‌ని సీఎం ప్ర‌తిపాదించారని తెలిపారు. పంజాబ్ త‌ర‌హాలో తెలంగాణ‌లో కూడా ధాన్యం సేక‌ర‌ణ చేప‌ట్టాలని రవి ప్రదీప్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.


ఎన్నారై టీఆర్ఎస్ లండన్ ఇంచార్జ్ నవీన్ భువనగిరి మాట్లాడుతూ.. వచ్చే యాసంగిలో తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం ఎంత వరిధాన్యం కొంటుందో ముందుగానే చెప్పాలని  డిమాండ్‌ చేశారు. ఎఫ్‌సీఐ తీరుతో రాష్ట్రాల్లో గంద‌ర‌గోళం నెల‌కొందని, రాష్ట్రాల నుంచి సేక‌రించే మొత్తంపై ఎఫ్‌సీఐ స్ప‌ష్ట‌త ఇవ్వ‌ట్లేదని మండిపడ్డారు. ప్రతి ఏడాది ఉత్ప‌త్తి పెరుగుతున్నా సేక‌రించే మొత్తం పెర‌గ‌ట్లేదని నవీన్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి సత్వరమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నారై టీఆర్ఎస్ యూకే  కార్యదర్శి సత్య చిలుముల మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవడమనేది దేశ రైతుల విజయంగా పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ రైతు మహా ధర్నా ద్వారా కేంద్రంలో మార్పు వచ్చినట్టు మేము భావిస్తున్నామని, అమరులైన రైతులకు నివ్వాలర్పిస్తున్నామని తెలిపారు. వారి స్ఫూర్తి పోరాటపటిమ గొప్పదని, గతంలో రైతులకు మద్దతుగా లండన్‌లో నిరసన తెలిపామని గుర్తుచేసుకున్నారు. కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితం కాకుండా నూతన వ్యవసాయ చట్టాలన్నీ వెనక్కి తీసుకొనే వరకు చిత్తశుద్ధితో ప్రధాని మోదీ పని చెయ్యాలని విజ్ఞప్తి చేశారు.


ఎన్నారై టీఆర్ఎస్ కోర్ కమిటీ సభ్యుడు రావుల పృద్వి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎటువంటి పిలుపునిచ్చిన బాధ్యత గల టీఆర్ఎస్ కార్యకర్తలుగా వారి వెంటే ఉండి నడుస్తామని స్పష్టం చేశారు. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని వ్యవసాయ రంగంలో ఎంతో అభివృద్ధి చేశారని, ఎన్నో గొప్ప పథకాల్ని ప్రవేశపెట్టి రైతే రాజయ్యే విధంగా కేసీఆర్ పని చేస్తున్నారని ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా రాష్ట్రానికి సహకరించి, వరి కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరిగా భారత హై కమీషన్ ప్రతినిధికి ఎన్నారై టీఆర్ఎస్ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, అధికార ప్రతినిధి రవి ప్రదీప్ పులుసు, లండన్ ఇంచార్జ్ నవీన్ భువనగిరి, కార్యదర్శి సత్య మూర్తి చిలుముల, కోర్ కమిటీ సభ్యుడు రావుల పృథ్వీ, పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.


Updated Date - 2021-11-21T13:19:47+05:30 IST