వినోద్‌ కుమార్‌కు ఎన్నారైల బృందం విజ్ఞప్తి

ABN , First Publish Date - 2021-01-13T14:44:20+05:30 IST

తెలంగాణకు చెందిన ఎన్నారైల సమస్యల పరిష్కారానికి గల్ఫ్‌ కార్మికుల సంక్షేమ బోర్డును శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని

వినోద్‌ కుమార్‌కు ఎన్నారైల బృందం విజ్ఞప్తి

(గల్ఫ్‌ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తెలంగాణకు చెందిన ఎన్నారైల సమస్యల పరిష్కారానికి గల్ఫ్‌ కార్మికుల సంక్షేమ బోర్డును శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని గల్ఫ్‌ ప్రవాసులు కోరారు. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌ కుమార్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. అమెరికా, పాశ్చాత్య దేశాల్లో ఉంటున్న ఎన్నారైలకు, గల్ఫ్‌ దేశాల్లో ఉంటున్న ప్రవాసులకు భారీ వ్యత్యాసం ఉందని, ఆర్థికంగా బలహీనులైన ఎడారి ప్రవాసులను ఆదుకునే దిశగా ప్రభుత్వానికి సూచించాలని కోరారు.


గల్ఫ్‌ దేశాల నుంచి తిరిగి వచ్చిన వారికి పునరావాసం కల్పించేందుకు స్వల్ప వడ్డీ రుణాలు అందించాలని, గల్ఫ్‌లో మరణించిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లించాలని విన్నవించారు. ఉపాధి, వైద్య విద్య హామీలు, బీమా, నైపుణ్యతకు కృషి చేయాలని, మోసాలను అరికట్టి, మోసాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించాలని కోరారు. వినోద్‌ కుమార్‌ను కలిసిన వారిలో మంద భీంరెడ్డి, కోటపాటి నర్సింహా నాయుడు, గంగుల మురళీధర్‌రెడ్డి, జనగాం శ్రీనివాస్‌, ఏముల రమేశ్‌, జంగం బాలకిషన్‌, కుంట దశరథ్‌గౌడ్‌ ఉన్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన వినోద్‌కుమార్‌.. వారి సంక్షేమానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బోర్డు ఏర్పాటు అంశాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానన్నారు. 

Updated Date - 2021-01-13T14:44:20+05:30 IST