యూఏఈ నుంచి తిరిగి వచ్చే ఎన్నారైలు ఇకపై..

ABN , First Publish Date - 2020-09-02T20:49:34+05:30 IST

యూఏఈ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చే ఎన్నారైలు ఇకపై ఎంబసీ లేదా కాన్సులేట్ కార్యాలయంలో తమ పేరు నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదని సంబంధిత అధికారులు తెలిపారు.

యూఏఈ నుంచి తిరిగి వచ్చే ఎన్నారైలు ఇకపై..

దుబాయ్: యూఏఈ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చే ఎన్నారైలు ఇకపై ఎంబసీ లేదా కాన్సులేట్ కార్యాలయంలో తమ పేరు నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదని సంబంధిత అధికారులు తెలిపారు. భారతదేశం, యూఏఈ మధ్య కుదిరిన ఎయిర్ బబుల్ ఒప్పందం ప్రకారం రిజిస్ట్రేషన్ అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రవాసులు నేరుగా విమానయాన సంస్థల నుంచి టికెట్లు బుక్ చేసుకోవచ్చని వారు పేర్కొన్నారు. కాగా, అంతర్జాతీయ ప్రయాణికులు తప్పనిసరిగా నింపే సెల్ఫ్-రిపోర్టింగ్ 'ఎయిర్ సువిధ'లో మాత్రం తప్పకుండా రిజిస్టర్ చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. ఇక ఇటీవల ప్రవాసులు తప్పనిసరిగా ముందు కాన్సులేట్ వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకున్నాకే ఆన్‌లైన్‌లో ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉండేది. 


అయితే అబుధాబి, షార్జా విమానాశ్రయాల నుంచి వచ్చేవారికి పీసీఆర్ టెస్టు తప్పనిసరి అని పేర్కొన్నారు. కానీ దుబాయ్ ఎయిర్‌పోర్టు నుంచి భారత్‌కు వచ్చే వారికి కొవిడ్ టెస్టు తప్పనిసరి ఏమీ కాదని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ అధికారులు వెల్లడించారు. కాగా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఈ నెల 30 వరకు అంతర్జాతీయ విమానాలకు అనుమతి లేదని ప్రకటించిన విషయం తెలిసిందే. వందే భారత్ మిషన్, కార్గో విమాన సర్వీసులు యధావిధిగా నడుస్తాయని డీజీసీఏ పేర్కొంది.   

 

Updated Date - 2020-09-02T20:49:34+05:30 IST