లద్దాఖ్లో మోదీ ఆకస్మిక పర్యటన వెనుక అజిత్ దోబాల్ వ్యూహరచన
ABN , First Publish Date - 2020-07-04T13:46:27+05:30 IST
ప్రధాని సరిహద్దుల్లో ఆకస్మిక పర్యటన వెనుక దేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్, సైనికదళాల అధిపతి బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ ముకుంద్ నారావణేలు తెరవెనుక వ్యూహరచన చేశారని సమాచారం....
న్యూఢిల్లీ : చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు రగులుతున్న సమయంలో సాక్షాత్తూ మన దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ లేహ్లోని కుషోక్ బకులా రింపోచీ విమానాశ్రయంలో దిగిన ఘటన మన సైనికులతో పాటు దేశ ప్రజలందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ప్రధాని సరిహద్దుల్లో ఆకస్మిక పర్యటన వెనుక దేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్, సైనికదళాల అధిపతి బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ ముకుంద్ నారావణేలు తెరవెనుక వ్యూహరచన చేశారని సమాచారం. ప్రధాని మోదీ లేహ్ విమానాశ్రయంలో దిగే వరకూ ఎవరికీ తెలియకుండా అత్యంత రహస్యంగా అజిత్ దోబాల్ సమన్వయం చేశారని వెల్లడైంది. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో రెండువారాల పాటు స్వీయ నిర్బంధం విధించుకున్న అజిత్ దోబాల్ ఢిల్లీలో ఉండి ప్రధాని మోదీ లద్దాఖ్ పర్యటనను సమన్వయ పర్చారని అధికారవర్గాల ద్వారా తెలిసింది.
ఎవరైనా దురాక్రమణకు యత్నిస్తే ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవాలని ప్రధాని మోదీ లద్దాఖ్ లోని ఆర్మీ కమాండర్లను కోరారు. 11వేల అడుగుల ఎత్తులో సరిహద్దుల్లో ప్రయాణించిన మోదీ హెలికాప్టరులోనే భారతసైన్యం కార్యాచరణ, సంసిద్ధత గురించి సైనికాధికారులతో సమీక్షించారు. 2017లోనూ డోక్లాం సంక్షోభ సమయంలోనూ ప్రధాని ఇదే సందేశమిచ్చారు.మొత్తం మీద ప్రధాని మోదీ అనూహ్యంగా లద్దాఖ్లోని నీమూ ప్రాంతంలో పర్యటించడం వెనుక జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్ తోపాటు మరో ఇద్దరు సైనికాధికారులు సమన్వయం చేయడం విశేషం.