Alert: పరీక్షలు వాయిదా
ABN , First Publish Date - 2021-12-09T13:42:37+05:30 IST
పరీక్షలు వాయిదా..
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ ఉద్యోగుల ఆందోళన ఫలితం
విజయవాడ(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పరిధిలో గురువారం నుంచి జరగాల్సిన బ్యాచిలర్ ఆఫ్ ఫిజియో థెరఫీ (బీపీటీ), సెకండ్ ఇయర్ బీఎస్సీ (పారామెడికల్) పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ పరీక్షలను మళ్లీ నిర్వహించే తేదీలను త్వరలో ప్రకటిస్తామని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. హెల్త్ యూనివర్సిటీ నిధులు రూ.400 కోట్లను స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్కు మళ్లించడాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు వారం రోజులుగా విధులను బహిష్కరించి ఆందోళన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ కారణంగానే బుధవారం నిర్వహించాల్సిన యూనివర్సిటీ స్నాతకోత్సవాన్ని వాయిదావేశారు. గురువారం నుంచి బీపీటీ, సెకండియర్ బీఎస్సీ పరీక్షలు ఉన్న నేపథ్యంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ శంకర్ బుధవారం ఆందోళనలో ఉన్న ఉద్యోగుల జేఏసీ నేతలను మరోసారి చర్చలకు ఆహ్వానించారు. గురువారం నుంచి పరీక్షల నిర్వహణకు సహకరించాలని జేఏసీ నేతలను కోరారు. యూనివర్సిటీ నిధులను తిరిగి తీసుకువచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేయడంతో యూనివర్సిటీ అధికారులు పరీక్షలను వాయిదా వేశారు. యూనివర్సిటీ ఉద్యోగులందరూ విధులను బహిష్కరించి ప్రధాన ద్వారం వద్ద ధర్నాను కొనసాగించారు.