రేపటి నుంచి విధుల బహిష్కరణకు ఎన్టీఆర్ వర్శిటీ ఉద్యోగుల పిలుపు
ABN , First Publish Date - 2021-11-30T20:20:52+05:30 IST
విజయవాడ: ఎన్టీఆర్ యూనివర్సిటీ ఉద్యోగులు నిరసన బాటపట్టారు.
విజయవాడ: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉద్యోగులు నిరసన బాటపట్టారు. బుధవారం నుంచి విధుల బహిష్కరణకు పిలుపు ఇచ్చారు. ఫైనాన్స్ కార్పొరేషన్ క్రెడిబిలిటీపై ఉద్యోగులు నమ్మకం లేదంటున్నారు. దిక్కు.. దివానంలేని సంస్థకు వందల కోట్లు ఇవ్వడం ఏంటని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్శిటీ ఉద్యోగుల నిరసనలకు ఇతర సంఘాలు మద్దతు ప్రకటించాయి.
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ నిధుల మళ్లింపుపై ఎన్ని అభ్యంతరాలు, విమర్శలు వచ్చినా సర్కారు తాను అనుకున్నదే చేసింది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం లోపు అత్యంత రహస్యంగా వర్సిటీ నిధుల బదలాయింపు ప్రక్రియ జరిగిపోయింది. ప్రొసీడింగ్స్ ఇచ్చే వరకూ ఉద్యోగులకు కూడా తెలియకుండా చేసేశారు. ఉద్యోగులు తెలుసుకునే లోపు ప్రక్రియ మొత్తం పూర్తి చేశారు. వర్సిటీ నిధులు మొత్తం రూ.400 కోట్లను స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్కు మళ్లించారు. ఇదేమిటని ఉన్నతాధికారులు ప్రశ్నిస్తే.. ‘నా బాస్ నాకు చెప్పారు. చేసేశాను. హెల్త్ వర్సిటీ సంక్షేమం, మనుగడ, ఉద్యోగుల భవిష్యత్తు నాకు అనవసరం. నా బాస్ నాకు దేవుడు’ అన్న సమాధానాలు వచ్చాయి. నిధులు మళ్లింపు, అధికారుల సమాధానాలపై ఉద్యోగులు భగ్గుమన్నారు. దీనిపై భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.