విధేయతే గీటురాయి
ABN , First Publish Date - 2020-07-31T04:51:05+05:30 IST
దేవుడి పట్ల విధేయంగా ఉండడమే విశ్వాసం. ఏసు ప్రభువు తనను భువిపైకి పంపిన తన తండ్రికి...
దేవుడి పట్ల విధేయంగా ఉండడమే విశ్వాసం. ఏసు ప్రభువు తనను భువిపైకి పంపిన తన తండ్రికి... అంటే దైవానికి జీవితపర్యంతం విఽధేయుడిగా మెలిగాడు. విశ్వాసులు ఎంత విధేయతతో ఉండాలో ఆచరించి చూపించాడు. దైవాభీష్టానికి విరుద్ధంగా ఏనాడూ ఆయన వ్యవహరించలేదు. ‘‘ఎవరైతే నా ఆజ్ఞలను ఆమోదించి, వాటికి విధేయంగా ఉంటారో వారిని నేను ప్రేమిస్తాను. ఎందుకంటే వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు. కనుక నా తండ్రి (దైవం) వారిని ప్రేమిస్తాడు. నేను వారిని ప్రేమిస్తాను. వారిలో ప్రతి ఒక్కరికీ నన్ను నేను ఆవిష్కరించుకుంటాను’’ (యోహాను సువార్త 14:21) అని ఆయన ప్రకటించాడు.
దేవుడి ప్రేమను పొందాలంటే మొక్కవోని విశ్వాసం, అచంచలమైన విధేయత ఉండాలి. తన ప్రియ పుత్రుడైన ఏసు ప్రభువు ద్వారా దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను పాటించాలి. ఏ మాత్రం సందేహించకుండా, సంకోచించకుండా ఆయన చూపిన మార్గంలో నడవాలి. అటువంటి విధేయతే విశ్వాసానికి గీటురాయి.