అధిక బరువు ఉన్నవారు తినవచ్చా..?
ABN , First Publish Date - 2020-07-13T22:13:46+05:30 IST
పనీర్ తింటే బరువు పెరుగుతారా.. పనీర్ మంచిదేనా? అధిక బరువు ఉన్నవారు కూడా తినవచ్చా?
ఆంధ్రజ్యోతి(13-07-2020)
ప్రశ్న: పనీర్ తింటే బరువు పెరుగుతారా.. పనీర్ మంచిదేనా? అధిక బరువు ఉన్నవారు కూడా తినవచ్చా?
- రేఖ,
డాక్టర్ సమాధానం: పనీర్ను పాల నుండి తయారు చేస్తారు. తయారు చేసిన పాలలో కొవ్వు శాతాన్ని బట్టి పనీర్లో ఎంత కొవ్వు ఉంటుందో తెలుస్తుంది. తక్కువ కొవ్వు ఉన్న పాలనుంచి చేసిన పనీర్లో మాంసకృత్తులు ఎక్కువ. పనీర్లో ఎముకల పటుత్వానికి అవసరమైన కాల్షియమ్, ఫాస్ఫరస్తో పాటు విటమిన్ బి- 12 పుష్కలంగా ఉంటుంది. మాంసకృత్తులు ఎక్కువగా ఉన్నా, కొంత పిండి పదార్థాలున్నప్పటికీ పనీర్ గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ కాబట్టి మధుమేహం ఉన్నవారు కూడా తీసుకోవచ్చు. వంద గ్రాముల పనీర్లో సుమారుగా 250 నుండి 300 కెలోరీలు ఉంటాయి. కాబట్టి మోతాదుకు మించి తీసుకుంటే బరువు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్స్లో ఉండే నూనెలో వేయించిన పనీర్ వంటలు ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు. పరిమిత మోతాదులో, అంటే రోజుకు 60 -70 గ్రాములకు మించకుండా పనీర్ తీసుకుని, రోజులో మిగతా ఆహారాన్ని కూడా కెలోరీ పరిధికి లోబడి తీసుకుంటే మంచిది. అధిక బరువు ఉన్నవారు కూడా పనీర్ తీసుకోవచ్చు. పానీర్లోని మాంసకృత్తుల వలన ఆకలి త్వరగా వేయదు. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు ఓ పూట పనీర్ తీసుకొంటే బరువు తగ్గేందుకూ ఉపయోగ పడుతుంది.
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్, వెల్నెస్ కన్సల్టెంట్
nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను
sunday.aj@gmail.comకు పంపవచ్చు)