భార్య చితిలో దూకి ప్రాణాలు తీసుకున్న భర్త!

ABN , First Publish Date - 2021-08-26T11:48:51+05:30 IST

ఒడిశాలోని కాలాహండీ జిల్లాలో ఒక వ్యక్తి తన భార్య చితిలో దూకి ప్రాణాలు తీసుకున్నాడు.

భార్య చితిలో దూకి ప్రాణాలు తీసుకున్న భర్త!

కాలాహండీ: ఒడిశాలోని కాలాహండీ జిల్లాలో ఒక వ్యక్తి తన భార్య చితిలో దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన గోలాముండా బ్లాక్ పరిధిలోని సియాల్జోడీ గ్రామంలో చోటుచేసుకుంది. భార్యకు అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో వృద్ధుడైన భర్త పరుగుపరుగున వెళ్లి, ఆ చితిలో దూకాడు. 


అగ్ని కీలలు పెద్దగా ఎగసిపడుతుండటంతో అక్కడున్నవారెవరూ ఆ వృద్ధుడిని కాపాడే సాహసం చేయలేకపోయారు. వారంతా చూస్తుండగానే ఆ వృద్ధుడు అగ్నికి ఆహుతైపోయాడు. మృతుడిని నీలమణి సబర్‌గా పోలీసులు గుర్తించారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం నీలమణి సబర్ భార్య రాయబరీ సబర్(60) కార్డియాక్ అరెస్ట్ కారణంగా మృతి చెందింది. ఆమెకు అంత్యక్రియలు నిర్వహించేందుకు తన నలుగురు కొడుకులు, ఇంటి చుట్టుపక్కలవారితో పాటు స్మశాన వాటికకు నీలమణి సబర్ వెళ్లాడు. అక్కడ మృతురాలి చితికి నిప్పంటించారు. తరువాత ఆ వృద్ధుని కుమారులు, ఇంటి చుట్టుపక్కలవారు సమీపంలోని చెరువులో స్నానం చేసేందుకు వెళ్లారు. అయితే నీలమణి సబర్ భార్య చితిని చూస్తూ అక్కడే కూర్చున్నాడు. ఇంతలోనే ఏమనున్నాడో ఏమో పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ చితిలో దూకేశాడు. అక్కడున్నవారు పరిస్థితిని అర్థం చేసుకునే లోగానే ఆ వృద్ధుడు చితి మంటలకు బలైపోయాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

Updated Date - 2021-08-26T11:48:51+05:30 IST