కరోనా ఎఫెక్ట్: తల్లిని చూసేందుకు కొడుకు ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2020-04-02T02:33:34+05:30 IST

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఏ విధంగా కబళిస్తోందో కొత్తగా చెప్పనవసరం లేదు.

కరోనా ఎఫెక్ట్: తల్లిని చూసేందుకు కొడుకు ఏం చేశాడంటే..

యంగ్స్‌టౌన్, ఒహాయో: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఏ విధంగా కబళిస్తోందో కొత్తగా చెప్పనవసరం లేదు. అమెరికాలో అయితే పరిస్థితి మరింత ఘోరంగా ఉందనే చెప్పాలి. ఇప్పటికే అమెరికా వ్యాప్తంగా ప్రజలు ఇళ్లలకే పరిమితమైపోయారు. దీంతో బంధువులు, స్నేహితులను కలవడం కూడా కుదరని పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే.. ఒహాయోకు చెందిన చార్లే ఆడమ్స్ మాత్రం లివింగ్ సెంటర్‌లో నివసిస్తున్న తన తల్లిని చూడకుండా ఉండలేకపోయాడు. ఎలానైనా తన తల్లిని చూడాలని వినూత్న ఐడియాతో ముందుకొచ్చాడు. అదేంటంటే.. చార్లే వృక్ష శాస్త్రవేత్త(ఆర్బరిస్ట్)గా పనిచేస్తున్నాడు. పెద్ద పెద్ద వృక్షాలను కట్ చేసేందుకు చార్లే వద్ద పెద్ద ట్రక్ కూడా ఉంది. మనిషిని చెట్టు పై వరకు తీసుకెళ్లేందుకు ట్రక్‌కు పెట్టెను కూడా అమర్చారు. అయితే ఇదే ట్రక్‌ను ఉపయోగించి చార్లే తన తల్లి నివసిస్తున్న ప్రదేశానికి వెళ్లాడు. మూడో అంతస్థులో ఉన్న తల్లి వద్దకు ట్రక్‌కు అమర్చిన పెట్టె ద్వారా వెళ్లాడు. పైనున్న ఫొటోలో ఈ దృశ్యాన్ని చూడవచ్చు. చార్లేను చూసిన తల్లి ఆనందానికి గురైంది. అంతేకాకుండా బిల్డింగ్ కింద నిలబడి చూస్తున్న చార్లే భార్య, పిల్లలను చూసి సంతోషించింది. చార్లే భార్య ఈ దృశ్యాన్ని ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్తా వైరల్ అయిపోయింది. తల్లిపై చార్లే చూపించిన ప్రేమకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా.. తన ఉద్యోగం తొందరగా ముగిసిన రోజల్లా తల్లిని ఇలానే కలుస్తానని చార్లే చెబుతున్నాడు.

Updated Date - 2020-04-02T02:33:34+05:30 IST