ఒమన్లో కోవిడ్ ఉధృతి.. ఒక్కరోజే..
ABN , First Publish Date - 2020-07-07T19:50:43+05:30 IST
గల్ఫ్ దేశమైన ఒమన్లో మహమ్మారి కరోనా ఉధృతి ఆగడం లేదు. అంతకంతకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.
ఒమన్: గల్ఫ్ దేశమైన ఒమన్లో మహమ్మారి కరోనా ఉధృతి ఆగడం లేదు. అంతకంతకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. సోమవారం ఒక్కరోజే ఒమన్లో 1,557 కొత్త కేసులు నమోదైనట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ తెలిపింది. వీటిలో 1,057 మంది ఒమన్ పౌరులుంటే.. మిగతా 500 మంది ప్రవాసులు ఉన్నారు. ఇప్పటివరకు ఆ దేశంలో కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 47,735కు చేరింది. అయితే, నిన్న ఒకేరోజు 1,229 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కావడం కాస్తా ఊరటనిచ్చే విషయం. దీంతో ఇప్పటి వరకు ఒమన్ వ్యాప్తంగా మొత్తం 29,146 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. కాగా, సోమవారం సంభవించిన ఐదు మరణాలతో కలిపి ఇప్పటివరకు ఆ దేశంలో కరోనా కాటుకు బలైన వారు 218 మంది అయ్యారు. మరోవైపు ఒమన్ ఈ వైరస్ వ్యాప్తి నియంత్రణకు ముమ్మరంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది. సోమవారం కూడా 3,852 కోవిడ్ టెస్టులు చేసింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 2,13,187 కరోనా పరీక్షలు నిర్వహించింది. ఇదిలా ఉంటే... ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ మహమ్మారి ఇప్పటికే 5.30 లక్షల మందిని బలిగొంది. కోటి 17 లక్షల మందికి ప్రబలింది.