తూర్పు గోదావరి జిల్లాలో ఒమైక్రాన్ కలకలం?
ABN , First Publish Date - 2021-12-16T02:08:03+05:30 IST
జిల్లాలోని రావులపాలెం మండలం గోపాలపురంలో ఒమైక్రాన్ వ్యాప్తి
తూర్పు గోదావరి: జిల్లాలోని రావులపాలెం మండలం గోపాలపురంలో ఒమైక్రాన్ వ్యాప్తి చెందిందనే అనుమనాలు గ్రామస్తుల్లో వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల సింగపూర్ నుంచి ఇద్దరు వ్యక్తులు గ్రామానికి వచ్చారు. వారికి చేసిన పరీక్షల్లో కరోనా నిర్ధారణ అయింది. దీంతో ఒమైక్రాన్ టెస్ట్ కోసం వారి నుంచి శాంపిల్స్ను పీహెచ్సీ వైద్యులు సేకరించారు. జీనోమ్ సీక్వెన్స్ కోసం పంపారు.
ఏపీలో రోజురోజుకు కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇవాళ కొత్తగా 163 కరోనా కేసులు నమోదు కాగా, కరోనా వైరస్తో ముగ్గురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,75,271కి కరోనా కేసులు చేరగా, కరోనా వైరస్ తో 14,471 మంది మరణించారు. ప్రస్తుతం ఏపీలో 1,821 యాక్టివ్ కేసులు ఉండగా, 20,58,979 మంది రికవరీ అయ్యారు. నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.
తొలిసారిగా విజయనగరం జిల్లాలో ఒమైక్రాన్..
అమరావతి (ఆంధ్రజ్యోతి), విజయనగరం రింగురోడ్డు, డిసెంబరు 12: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్.. రాష్ట్రంలోకి కూడా వచ్చేసింది. రాష్ట్రంలో తొలిసారిగా విజయనగరం జిల్లాలో ఒమైక్రాన్ కేసు నమోదైన విషయం తెలిసిందే. కానీ.. ఈ కేసును గుర్తించేలోపు ఆయనకు కరోనా నెగిటివ్ వచ్చింది! అంటే రాష్ట్రంలో తొలి ఒమైక్రాన్ కేసు నమోదైనా.. ప్రస్తుతం యాక్టివ్ కేసులు జీరో అన్నమాట! విజయనగరం జిల్లా ఎస్.కోట మండలానికి చెందిన 34 ఏళ్ల వ్యక్తి ఐర్లాండ్లోని ఫార్మా కంపెనీలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. గత నెల 27న ఆయన ఐర్లాండ్ నుంచి ముంబై వచ్చారు. ఎయిర్పోర్టులో నిర్వహించిన పరీక్షలో కరోనా నెగిటివ్ రావడంతో ఆయన విశాఖలోని బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడి ఆరోగ్య సిబ్బంది ఈ నెల 4న ఆయనకు మరోసారి ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించగా కరోనా పాజిటివ్ వచ్చింది. ఒమైక్రాన్ వేరియంట్ అనుమానంతో ఆయన శాంపిల్స్ను హైదరాబాద్లోని సీసీఎంబీకి పంపించారు. అక్కడ జినోమ్ సీక్వెన్సింగ్ టెస్టులో ఆయనకు సోకింది ఒమైక్రాన్ వేరియంట్ అని తేలింది.