కరోనా ఆంక్షలను సడలించిన బ్రిటన్.. ఇక మాస్కు తప్పనిసరి కాదు.. కారణం ఏంటంటే..
ABN , First Publish Date - 2022-01-21T02:09:12+05:30 IST
ఒమైక్రాన్ కట్టడి కోసం విధించిన అదనపు ఆంక్షలను వచ్చే వారం నుంచి సడలిస్తున్నట్టు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తాజాగా ప్రకటించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఒమైక్రాన్ కట్టడి కోసం విధించిన అదనపు ఆంక్షలను వచ్చే వారం నుంచి సడలిస్తున్నట్టు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తాజాగా ప్రకటించారు. కరోనా కేసుల పెరుగుదల పతాక స్థాయిని చేరి క్రమంగా తగ్గుముఖం పడుతోందన్న శాస్త్రవేత్తల అంచనాల నడుమ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. అక్కడి ప్రజలు అన్ని ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్కు ధరించాల్సిన పరిస్థితి తప్పింది. అంతేకాకుండా.. పెద్ద పెద్ద సభలు, సమావేశాల్లో పాల్గొనేవారు తాము టీకా తీసుకున్నట్టు తెలిపే ధృవీకరణ పత్రం తప్పనిసరిగా తమ వెంట తీసుకెళ్లాలనే నిబంధన కూడా రద్దైపోయింది. అవసరమనుకున్న సందర్భాల్లో వర్క్ ఫ్రం హోంకు కూడా స్వస్థి పలికే స్వేచ్ఛను ప్రభుత్వం ఇచ్చింది.
ప్రజలపై తమకు నమ్మకముందని, అందుకే మాస్కు ఎప్పుడు, ఎక్కడ ధరించాలనే నిర్ణయాన్ని వారికే వదిలేస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. కరోనా తీవ్రత గరిష్ట స్థితికి చేరుకుని ఇప్పుడు తిరోగమనంలో పయనిస్తున్నట్టు ఆఫీస్ ఆఫ్ నేషనల్ స్టాటిస్టిక్స్ గణాంకాలు సూచిస్తున్న విషయాన్ని బోరిస్ జాన్సన్ బ్రిటన్ పార్లమెంట్కు తెలిపారు. ఫలితంగా.. చాలా పరిమిత స్థాయిలో కరోనా ఆంక్షలను విధించే వీలు చిక్కిందని పేర్కొన్నారు.