యాంటీ డ్రోన్ టెక్నాలజీలపై జెన్ టెక్నాలజీస్ భారీ పెట్టుబడులు
ABN , First Publish Date - 2021-09-16T08:10:47+05:30 IST
హైదరాబాద్కు చెందిన జెన్ టెక్నాలజీస్ యాంటీ డ్రోన్ సిస్టమ్స్, ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ యాంటీ డ్రోన్ సిమ్యులేటర్లు, హెవీ లిఫ్ట్ డ్రోన్లు, డ్రోన్, యాంటీ డ్రోన్ సిమ్యులేటర్లపై దృష్టి సారించింది.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్కు చెందిన జెన్ టెక్నాలజీస్ యాంటీ డ్రోన్ సిస్టమ్స్, ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ యాంటీ డ్రోన్ సిమ్యులేటర్లు, హెవీ లిఫ్ట్ డ్రోన్లు, డ్రోన్, యాంటీ డ్రోన్ సిమ్యులేటర్లపై దృష్టి సారించింది. ఈ రంగాల్లో తన స్థానం సుస్థిరం చేసుకునే దిశగా వ్యూహాలు రచించింది. గత కొద్ది సంవత్సరాల్లో యాంటీ డ్రోన్ టెక్నాలజీపై భారీగా పెట్టుబడులు పెట్టినట్టు జెన్ టెక్నాలజీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ అట్లూరి తెలిపారు. ఇటీవల భారత వైమానిక దళానికి కౌంటర్ అన్మ్యాన్డ్ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్స్ (సీయూఏఎస్) సరఫరా చేయడానికి రూ.155 కోట్ల ఆర్డర్ లభించినట్లు తెలియచేశారు. దాదాపు రెండేళ్ల క్రితం యునిస్ట్రింగ్ టెక్ సొల్యూషన్స్లో (యూటీఎస్) 51 శాతం వాటా జెన్టెక్ కొనుగోలు చేసింది. యాంటీ డ్రోన్ విభాగంలో మరిన్ని టెక్నాలజీలను అభివృద్ధి చేయడంలో యూటీఎస్ నిమగ్నమై ఉందని, ఈ ఏడాది రూ.15 కోట్ల టర్నోవర్ ఈ విభాగంలో ఆశిస్తున్నామని ఆయన చెప్పారు.
ఈ ఏడాది 2-3 మెడికల్ ఉత్పత్తులు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మెడికల్ టెక్నాలజీస్లో రెండు, మూడు ఉత్పత్తులను కంపెనీ అభివృద్ధి చేయనుంది. ఆయిల్ రిఫైనరీలు, ఇతర వ్యూహాత్మక రంగాలపై కంపెనీ దృష్టి సారించనుంది. గత అయిదేళ్లలో ఆర్ అండ్ డీపై కంపెనీ రూ.67.47 కోట్ల పెట్టుబడులు పెట్టింది. దేశ, విదేశాల్లో 109 మేధో సంపత్తి హక్కులకు కంపెనీ దరఖాస్తు చేయగా ఇప్పటి వరకూ 27 పేటెంట్లు లభించాయి.
యూఏఈలో కార్యాలయం:
జెన్ టెక్నాలజీస్ యూఏఈలో ఏర్పాటు చేసిన కార్యాలయంలో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని.. రానున్న నెలల్లో కంపెనీకి రూ.60 కోట్ల ఆర్డర్లు లభించగలవని, ఇందులో యూఏఈ కార్యాలయం నుంచి కూడా ఆర్డర్లు వచ్చే వీలుందని జెన్ టెక్నాలజీస్ అంచనా వేస్తోంది. కంపెనీ చేతిలో ప్రస్తుతం మొత్తం రూ.403 కోట్ల ఆర్డర్లు ఉన్నాయి.