బెంగాల్లో 8 విడతల పోలింగ్పై సుప్రీంలో సవాల్
ABN , First Publish Date - 2021-03-03T13:59:07+05:30 IST
తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కానీ ప్రత్యేకంగా పశ్చిమ బెంగాల్లోనే ఎందుకు 8 విడతల పోలింగ్ నిర్వహిస్తున్నారు. బెంగాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు కానీ
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను 8 విడతల్లో నిర్వహించడాన్ని సవాల్ చేస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వపు హక్కు) కు ఇది పూర్తిగా భిన్నమైన చర్య అని పిటిషన్దారు లాయర్ మనోహర్లాల్ శర్మ ప్రజాప్రయోజన వ్యాజ్యంలో పేర్కొన్నారు. బెంగాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు కానీ, మరే ప్రత్యేక పరిస్థితులు కానీ లేకపోయినప్పటికీ ఎక్కవ విడతల్లో పోలింగ్ నిర్వహించడమేంటని ప్రశ్నించారు.
‘‘తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కానీ ప్రత్యేకంగా పశ్చిమ బెంగాల్లోనే ఎందుకు 8 విడతల పోలింగ్ నిర్వహిస్తున్నారు. బెంగాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు కానీ, మరే ప్రత్యేక పరిస్థితులు కానీ లేకపోయినప్పటికీ ఎక్కవ విడతల్లో పోలింగ్ నిర్వహించడానికి కారణం ఏంటి? ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు పూర్తి వ్యతిరేకం. మిగతా రాష్ట్రాలతో బెంగాల్ను సమానంగా చూడడం లేదు’’ అని తన పిటిషన్లో పేర్కొన్నారు.
ఇక బీజేపీ గురించి ప్రస్తావిస్తూ ‘‘జైశ్రీరామ్ అనే నినాదాన్ని భావోద్వేగాలు రెచ్చగొట్టి ఎన్నికల్లో లబ్ది పొందాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. జైశ్రీరామ్ అనే పదాన్ని ఉపయోగించడం నిషేధించాలి. వ్యక్తులు గానీ, సమూహాలు గానీ, ఎన్నికల సమయంలో ఆ తర్వాత అంతకు ముందు ఈ నినాదాన్ని ఉపయోగించకుండా అడ్డుకోవాలి’’ అని మనోహర్లాల్ శర్మ తన పిటిషన్లో పేర్కొన్నారు.