మరోసారి ఎండల తీవ్రత

ABN , First Publish Date - 2020-06-05T10:18:00+05:30 IST

జిల్లాలో మరోసారి ఎండల తీవ్రత పెరిగింది. జిల్లావ్యాప్తంగా అధికచోట్ల గురువారం గత నాలుగైదు రోజుల కన్నా ఉష్ణోగ్రతలు ..

మరోసారి ఎండల తీవ్రత

పలుచోట్ల పెరిగిన ఉష్ణోగ్రతలు

వేడిగాలులు, ఉక్కపోతతో అవస్థలు

చీమకుర్తిలో 43.14, టంగుటూరులో43.03

రాష్ట్ర అత్యధికంలో రెండు, మూడు స్థానాలు


ఒంగోలు, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో మరోసారి ఎండల తీవ్రత పెరిగింది. జిల్లావ్యాప్తంగా అధికచోట్ల గురువారం గత నాలుగైదు రోజుల కన్నా ఉష్ణోగ్రతలు పెరిగాయి. రాష్ట్రంలోనే అధిక ఉష్ణోగ్రతలు జిల్లాలో నమోదయ్యాయి. వాటిలో చీమకుర్తి రెండవ స్థానంలో ఉంది. జిల్లాలో నాలుగైదు రోజుల కిందట వరకు ఎండల మండిపోయాయి. పలుప్రాంతాల్లో 47 డిగ్రీల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వేడిగాలులు కూడా అధికంగా ఉండటమే కాక ఉక్కపోతతో ప్రజానీకం ఉక్కిరిబిక్కిరయ్యారు. అయితే నాలుగు రోజులుగా వాతావరణంలో మార్పు వచ్చింది. పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిశాయి.


వాతావరణం కాస్తంత చల్లబడింది. అధిక ప్రాంతాల్లో బుధవారం గరిష్ట ఉష్ణోగ్రతలు 36 నుంచి 39 డిగ్రీల లోపుగానే ఉన్నాయి. ఇలా ఇక ఎండల తీవ్రత తగ్గిందని ప్రజలు ఊపిరిపీల్చుకుంటుండగా గురువారం ఒక్కసారిగా ఎండలు పెరిగాయి.   గురువారం మధ్యాహ్నం 2గంటల సమయంలో చీమకుర్తిలో 43.14 డిగ్రీలు, టంగుటూరులో 43.03డిగ్రీలు నమోదు కాగా ఆ సమయంలో అదే రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైన తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. అంతకుముందు ఒంటిగంట సమయంలో ఒంగోలు మండలం త్రోవగుంటలో 42.45డిగ్రీలు నమోదు కాగా ఆ సమయంలో రాష్ట్రంలో నాల్గవ స్థానంలో ఉంది. మొత్తంగా గురువారం రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలు పరిశీలిస్తే నెల్లూరు జిల్లా వెంకటగిరి 43.18 డిగ్రీలు కాగా చీమకుర్తిలో 43.14 డిగ్రీల నమోదై రెండవస్థానంలో ఉంది. దీనికి తోడు పలుచోట్ల వేడిగాలులు తీవ్రత కూడా కనిపించింది. 

Updated Date - 2020-06-05T10:18:00+05:30 IST