పనిచేస్తున్న ఇంటికే కన్నం.. నిందితుడి అరెస్టు

ABN , First Publish Date - 2021-04-09T13:27:18+05:30 IST

పక్షవాతం బారిన పడిన రోగికి సహాయంగా ఉండేందుకు నియమించిన

పనిచేస్తున్న ఇంటికే కన్నం.. నిందితుడి అరెస్టు

హైదర్‌నగర్‌ : పక్షవాతం బారిన పడిన రోగికి సహాయంగా ఉండేందుకు నియమించిన వ్యక్తి అదే ఇంటికి కన్నం వేసిన సంఘటన కేపీహెచ్‌బీ పరిధిలో జరిగింది. గురువారం పోలీ‌స్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మీనారాయణ వివరాలు వెల్లడించారు. కేపీహెచ్‌బీకాలనీ ఫేజ్‌-5లో నివాసం ఉండే వేణుగోపాల్‌ రాధాకృష్ణ మామయ్య మోహన్‌రావు రెండేళ్ల క్రితం పక్షవాతంతో మంచానికి పరిమితమయ్యాడు. అతడి బాగోగులు చూసేందుకు సైనిక్‌పురిలోని వీ కేర్‌ అనే సంస్థను సంప్రదించాడు. ఆ సంస్థ భద్రాద్రి కొత్తగూడానికి చెందిన మెరుగు శశికరణ్‌ని మోహన్‌రావుకు సహాయకుడిగా పంపించారు.


రెండు సంవత్సరాలు పాటు నమ్మకంగా పనిచేసిన శశికిరణ్‌ గతనెల 28న తన స్థానంలో మరో ఉద్యోగిని నియమించి పని మానివేశాడు. ఇంటి యజమాని వేణుగోపాల్‌ మార్చి 30న బీరువాలో చూడగా, అందులో దాచివుంచిన రూ.7.80 లక్షల నగదు కనిపించకపోవడంతో శశికిరణ్‌మీద అనుమానంతో పోలీసులకు ఫిర్యాదుచేశాడు. దీంతో శశికిరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. అతని వద్ద నుంచి రూ.6.75 లక్షలు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.

Updated Date - 2021-04-09T13:27:18+05:30 IST