సహజీవనం చేసే వ్యక్తే హంతకుడు.. వీడిన మిస్టరీ

ABN , First Publish Date - 2020-09-10T13:19:59+05:30 IST

మార్కెట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మంగళవారం వెలుగు చూసిన మహిళ హత్య కేసు చిక్కుముడి వీడింది.

సహజీవనం చేసే వ్యక్తే హంతకుడు.. వీడిన మిస్టరీ

హైదరాబాద్/రెజిమెంటల్‌బజార్‌ : మార్కెట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మంగళవారం వెలుగు చూసిన మహిళ హత్య కేసు చిక్కుముడి వీడింది. సహజీవనం చేసే వ్యక్తే ఆమెను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. మంగళవారం ఉదయం ఆర్పీ రోడ్డులోని రైల్వే బ్రిడ్జి ప్రాంతంలో గల సులభ్‌ కాంప్లెక్స్‌లో మహిళ మృతదేహం లభించిన విషయం తెలిసిందే. నిందితుడి కోసం టాస్క్‌ఫోర్స్‌తోపాటు మార్కెట్‌ పోలీసులు, డీసీపీ పార్టీకి  చెందిన ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు.


మృతురాలు ప్రకాశం జిల్లాకు చెందిన భూలక్ష్మి(30)గా గుర్తించారు. అదే జిల్లాకు చెందిన వెంకట చెన్నయ్యతో ఏర్పడిన స్నేహం సహజీవనానికి దారి తీసింది. గతంలో పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న వెంకట చెన్నయ్య కొన్నేళ్ల క్రితం భార్య, పిల్లలను వదిలి పెట్టి నగరానికి వచ్చి ఉప్పల్‌లో ఉంటున్నాడు. భూలక్ష్మి ఉపాధి నిమిత్తం ఫిబ్రవరిలో నగరానికి వచ్చి ఉప్పల్‌ ప్రాంతంలో నివసిస్తోంది. ఇద్దరికీ ఓ కల్లు కాంపౌండ్‌లో పరిచయం ఏర్పడింది. ఆగస్టు 14వ తేదీన ఇద్దరూ ఇళ్లు ఖాళీ చేసి మార్కెట్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోగల గాస్‌మండి వచ్చారు. వెంకట చెన్నయ్య మేస్త్రిగా, భూలక్ష్మి కూలి పనిచేస్తూ జీవిస్తున్నారు. ఇద్దరికీ మద్యం తాగే అలవాటు ఉంది. 


డబ్బు విషయమై ఘర్షణ 

భూలక్ష్మి కొద్ది రోజుల క్రితం రూ. 5,500 తీసుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోయి తర్వాత తిరిగి వచ్చింది. చెప్పకుండా వెళ్లినందుకు వారిద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. గత వారం కూడా రూ. 1,500 తీసుకొని వెళ్లిపోయింది. తిరిగొచ్చిన తర్వాత ఆదివారం ఇద్దరి మధ్య డబ్బు విషయమై మళ్లీ గొడవ జరిగింది. అదేరోజు రాత్రి ఆమె బయటకు వెళ్తుండగా.. ఎక్కడికి వెళ్తున్నావని వెంకట చెన్నయ్య నిలదీశాడు. తన ఇష్టమని ఆమె చెప్పడంతో తీవ్రంగా కొట్టాడు. మద్యం మత్తులో గొంతు నులిమి కాలితో తొక్కడంతో చనిపోయింది. మృతదేహాన్ని తీసుకెళ్లి మూత్రశాల వద్ద పడేసి ఇంటికెళ్లి నిద్రపోయాడు. మహిళను స్థానికులు గుర్తించడంతో సహజీవనం చేస్తున్న వ్యక్తే నిందితుడని పోలీసులు వెంకట చెన్నయ్యను అరెస్టు చేశారు.

Updated Date - 2020-09-10T13:19:59+05:30 IST