HYD : Friend తో సరదాగా సైకిల్ తొక్కుకుంటూ వెళ్లిన బాలుడు.. ఇంతలో ఊహించని విధంగా...!
ABN , First Publish Date - 2021-09-15T16:28:39+05:30 IST
స్నేహితుడితో పాటు సరదాగా సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్న బాలుడు ఊహించని విధంగా...
- బాలుడిని మింగిన చెరువు
- వాన నీటిలో కొట్టుకుపోయిన చెప్పులు
- నీటితో పాటు చెరువులోకి..
- వాటి కోసం వెళ్లి బాలుడి (8) మృతి
- చెట్టు కొమ్మను పట్టుకుని బయటపడ్డ మరో బాలుడు (9)
- ఐటీ ఉద్యోగి ఇంట తీరని విషాదం
స్నేహితుడితో పాటు సరదాగా సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్న బాలుడు ఊహించని విధంగా చెరువులో మునిగి మృతి చెందాడు. రోడ్డుపై నిలిచిన వాన నీటిలో జారిపడ్డ చెప్పుల కోసం పరిగెడుతూ స్నేహితులు ఇద్దరూ చెరువులోకి వెళ్లిపోయారు. నీటిలో మునిగి ఒకరు మృతి చెందగా.. చెట్టు కొమ్మను పట్టుకుని మరొకరు బయటపడ్డారు.
హైదరాబాద్ సిటీ/హయత్నగర్ : అయిదు నిమిషాలలో వస్తానని చెప్పి వెళ్లిన బాలుడు ఇక ఎన్నటికీ తిరిగిరాడని తెలిసిన ఆ కుటుంబ వేదన వర్ణనాతీతం. హయత్నగర్ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే ధీరజ్రెడ్డి పదిహేనేళ్ల క్రితం తట్టిఅన్నారం హనుమాన్నగర్కు కుటుంబంతో కలిసి వచ్చారు. ప్రస్తుతం అతను చెన్నయ్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. భార్య మూడేళ్ల క్రితం చనిపోవడంతో కొడుకు రిషిక్ శ్రీరాంరెడ్డి (8) నానమ్మ, తాతయ్యల వద్ద ఉంటున్నాడు. ధీరజ్రెడ్డి పది రోజులకు ఒకసారి తట్టి అన్నారానికి వచ్చి తల్లిదండ్రులను, కొడుకును చూసుకుని వెళ్తాడు. రిషిక్ శ్రీరాంరెడ్డి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 3వ తరగతి చదువుతున్నాడు.
అసలేం జరిగింది..!?
మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు భోజనం చేసిన తర్వాత శ్రీరాంరెడ్డి, అతని స్నేహితుడు మేఘనాథ్ (9) వేర్వేరుగా సైకిల్ తొక్కుకుంటూ హనుమాన్నగర్ను ఆనుకుని ఉన్న ఊర చెరువు పక్కనున్న రోడ్డు గుండా వెళ్తున్నారు. రోడ్డుపై ఉన్న వర్షపు నీటిలో శ్రీరాంరెడ్డి చెప్పులు కొట్టుకుపోతున్నాయి. ఇద్దరూ సైకిళ్లు దిగి కొట్టుకుపోతున్న చెప్పుల వెనుక పరిగెడుతూ.. అలా చెరువులోనికి వెళ్లిపోయారు. పోను పోను చెరువు లోతుగా ఉండడంతో మునిగిపోయారు. మేఘనాథ్ చెరువులో ఉన్న ఓ చెట్టును పట్టుకుని కేకలు వేశాడు.
వాటిని విన్న స్థానికులు హయత్నగర్ పోలీసులకు సమాచారం అందించారు. కానిస్టేబుల్ కృష్ణ చెరువులోనికి దిగి చెట్టుకు తాడు కట్టి మేఘనాథ్ను సురక్షితంగా బయటకు తెచ్చారు. రిషిక్ శ్రీరాంరెడ్డి అప్పటికే నీరు మింగి మృతి చెందాడు. మేఘనాథ్ తండ్రి ఏసీపీగా పని చేస్తున్నట్లు తెలిసింది. సైకిలు తొక్కుకుని ఐదు నిమిషాల్లో వస్తానని చెప్పి వెళ్లిన మనవడు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడంటూ.. నానమ్మ, తాతయ్య బోరున విలపిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.