ఒక ఇంటికి ఒకటే మీటర్
ABN , First Publish Date - 2022-01-28T06:18:11+05:30 IST
ఇకపై ఒక ఇంటికి ఒకే విద్యుత్ మీటరు ఉండే విధంగా ఆ శాఖ నిర్ణయించిం ది. ఈ మేరకు విద్యుత్ శాఖ అధికారులు ఇంటింటికీ తిరిగి ఎక్కువ మీటర్లు ఉంటే వాటిని తొలగిస్తున్నారు.
ఏలూరు సిటీ, జనవరి 27 : ఇకపై ఒక ఇంటికి ఒకే విద్యుత్ మీటరు ఉండే విధంగా ఆ శాఖ నిర్ణయించిం ది. ఈ మేరకు విద్యుత్ శాఖ అధికారులు ఇంటింటికీ తిరిగి ఎక్కువ మీటర్లు ఉంటే వాటిని తొలగిస్తున్నారు. చాలా మంది విద్యుత్ బిల్లులు భారం తగ్గించుకునేందుకు ఒక ఇంటిలో ఎన్ని పోర్షన్లు ఉంటే అన్ని మీటర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. వాణిజ్య సర్వీసులకు ఇదే పరిస్థితి ఉంది. ఇకపై ఒకే మీటరు నినాదంతో విద్యుత్ శాఖ విజిలెన్స్ విభాగం, వీఆర్వో, ఏవోల బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. ఒకే భవనంలో నాలుగైదు నివాసా లు ఉన్నా వంట గది ఉంటేనే ఇంటిగా పరిగణించి విద్యుత్ సర్వీసు ఉండేలా చేస్తున్నారు. మూడు నెలలపాటు వరుసగా నెలకు 350 యూనిట్లుకంటే అధికంగా విద్యుత్ వినియోగం ఉంటే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలకు అనర్హులవుతారు. దీంతో చాలా మంది వినియోగదారులు ఒకే ఇంటికి రెండు నుంచి మూడు మీటర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎలకా్ట్రనిక్ వస్తువుల వినియోగం బాగా పెరిగింది. వాషింగ్ మిషన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, వాటర్ హీటర్స్, వాటర్ ప్యూరిఫైయిర్స్ వంటి ఎలకా్ట్రనిక్ పరికరాలను వినియోగిస్తున్నారు. దీంతో చాలామంది ఒకటి కంటే ఎక్కువగా విద్యుత్ మీటర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. జిల్లాలో గృహ విద్యుత్ సర్వీసులు 12 లక్షల 12వేల 992 ఉన్నాయి. ఇవి కాకుండా వాణిజ్య సర్వీసులు లక్షా 45 వేల 5 ఉన్నాయి. వీటిల్లో ఒకే ఇంటిలో అదనపు మీటర్లు (కిచెన్ ఒకటే ఉండి ఎక్కువ మీటర్లు) ఉంటే తొలగిస్తారు. జిల్లావ్యాప్తంగా సర్వే నిర్వహించి ఇప్పటికే కొన్ని మీటర్లను తొలగించారు. కొన్ని ఇళ్లల్లో రెండు పోర్షన్లు ఉండి రెండు విడివిడి నివాస ప్రాంతాలున్నా వాటికి నోటీసులు జారీ చేస్తున్నా రు. నిబంధనల ప్రకారం ఒకే ఇంటిలో రెండు పోర్షన్లు ఉండి రెండు కిచెన్లుంటే ఆ ఇంటికి రెండు మీటర్లు ఇవ్వవచ్చు. కాని తమ ఇంటికి రెండు మీటర్లు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉన్నా నోటీసులు జారీ చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.