‘కరోనా’కు 100 రోజులు.. తల్లడిల్లుతున్న ప్రపంచం
ABN , First Publish Date - 2020-04-09T13:10:59+05:30 IST
2019 డిసెంబరు 31... కొత్త సంవత్సరాన్ని స్వాగతించడానికి అంతా సిద్ధమవుతున్నారు. వుహాన్లో ఉన్న సీఫుడ్ హోల్సేల్ మార్కెట్ పరిసరాల్లో న్యుమోనియా లాంటి వ్యాధి వ్యాపిస్తోందని చైనా ప్రభుత్వం ప్రకటించింది.
వూహాన్లో తొలి షట్డౌన్కు నేటితో వంద రోజులు
2019 డిసెంబరు 31... కొత్త సంవత్సరాన్ని స్వాగతించడానికి అంతా సిద్ధమవుతున్నారు. వుహాన్లో ఉన్న సీఫుడ్ హోల్సేల్ మార్కెట్ పరిసరాల్లో న్యుమోనియా లాంటి వ్యాధి వ్యాపిస్తోందని చైనా ప్రభుత్వం ప్రకటించింది. ఆ మరుసటి రోజునే అంటే... జనవరి 1వ తేదీన సీఫుడ్ మార్కెట్ను మూసేసింది. ఇది జరిగి నేటికి సరిగ్గా వంద రోజులు! కరోనా గమనంలో కీలక ఘట్టాలివి...
1వ రోజు (జనవరి 1): తొలి షట్డౌన్
వూహాన్ సీఫుడ్ మార్కెట్ను మూసివేశారు. వైద్యాధికారులు కొందరు ప్లాస్టిక్ బ్యాగుల్లో నమూనాలు సేకరించారు. వుహాన్ ఆస్పత్రులకు గుర్తుతెలియని లక్షణాలతో రోగులు క్యూ కడుతున్నారని సోషల్ మీడియాలో సందేశాలు వెల్లువెత్తాయి.
9వరోజు (జనవరి 9): తొలి మరణం
వూహాన్లో కలకలానికి కొత్తరకం కరోనా వైరస్ కారణమని తేల్చారు. దీనికి ‘కరోనా వైరస్ డిసీజ్ - 2019’కు సంక్షిప్త రూపంగా ‘కొవిడ్ 19’ అని పేరు పెట్టారు. వూహాన్ ఆస్పత్రిలో 61ఏళ్ల వృద్ధుడు ఈ వ్యాధితో మరణించాడు. ఇదే... తొలి కరోనా మృతి.
13వ రోజు (జనవరి 13): థాయ్లో తొలి కేసు
కరోనా వైరస్ చైనా దాటి... థాయ్లాండ్లో అడుగు పెట్టింది. వూహాన్ నుంచి బ్యాంకాక్ వెళ్లిన 61ఏళ్ల వృద్ధుడికి వైరస్ సోకింది.
20వ రోజు (జనవరి 20): ఊపందుకున్న వైరస్
వూహాన్తో ప్రత్యక్ష సంబంధం లేని రెండు కేసులు గువాంగ్డాంగ్ ప్రావిన్స్లో వెలుగు చూశాయి. దీంతో... ఈ వైరస్ మనుషుల నుంచి మనుషులకు సోకుతుందని నిర్ధారణ అయ్యింది. వైరస్ క్రమంగా జపాన్, దక్షిణ కొరియా, అమెరికాకూ విస్తరించింది. వూహాన్ నుంచి తిరిగి వచ్చిన 35ఏళ్ల వ్యక్తికి వాషింగ్టన్ ఆస్పత్రిలో పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇదే అమెరికాలో మొదటి కరోనా కేసు.
24వ రోజు (జనవరి 24): యూర్పలోకి..
చైనీయుల కొత్త సంవత్సరం సందర్భంగా బంధుమిత్రులను కలుసుకోవడానికి వేలాది మంది వూహాన్ నగరానికి రావడం మొదలైంది. తిరుగు ప్రయాణంలో చైనా నుంచి ఫ్రాన్స్ వచ్చిన ఇద్దరికి పాజిటివ్గా నిర్ధారణ కావడంతో వైరస్ యూర్పకు చేరింది.
31వ రోజు (జనవరి 31): బ్రిటన్లో తొలికేసు
యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ పూర్తిగా బయటకొచ్చిన రోజే (బ్రెగ్జిట్) ఆ దేశంలో తొలి కరోనా కేసు నమోదైంది.
36వ రోజు (ఫిబ్రవరి 4): చైనా వెలుపల తొలి మరణం
మనీలా ఆస్పత్రిలో వూహాన్ వాసి ఒకరు కరోనాతో మరణించాడు. కరోనా గురించి ముందే హెచ్చరించిన వైద్యుడు లీ వెన్లియాంగ్ మరణంతో చైనా వ్యాప్తంగా లాక్డౌన్ విధించారు. ఎండలు ముదిరితే వైరస్ ఉండదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు.
50వ రోజు (ఫిబ్రవరి 19): కొరియా, ఇరాన్లో అలజడి
వైరస్ లక్షణాలున్న మహిళ చర్చికి, హోటల్కు వెళ్లడంతో కరోనా తీవ్రత ఊపందుకుందని దక్షిణ కొరియా మంత్రి ప్రకటించారు. ఇరాన్లో మొదటిసారిగా రెండు కేసులు నమోదయ్యాయి. మిలాన్లో జరిగిన ఫుట్బాల్ మ్యాచ్కు నగరంలోని మూడొంతుల మంది హాజరయ్యారు. వేలాదిగా స్పానిష్ దేశీయులు సైతం ఈ మ్యాచ్ కోసం తరలివచ్చారు. ఇటలీ, స్పెయిన్లలో వైరస్ విస్తరణకు ఇది కారణమైంది.
66వ రోజు (మార్చి 6): ఇటలీలో సంక్షోభం
ఆరు రోజుల్లోనే ఇటలీలో మృతుల సంఖ్య ఆరు రెట్లు పెరిగిపోయింది.
71వ రోజు (మార్చి 11): మహమ్మారిగా కొవిడ్
ప్రపంచ ఆరోగ్య సంస్థ కొవిడ్-19ను మహమ్మారిగా ప్రకటించింది.
77వ రోజు(మార్చి 17): జనజీవనం స్తంభన
ఖండాలు, దేశాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కరోనా కారణంగా మరణించినవారిలో మూడొంతుల మంది యూరోపియన్లే.
83వ రోజు (మార్చి 23): దేశ దేశాల్లో లాక్డౌన్
ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 3,70,000 దాటింది. అనేక దేశాలు లాక్డౌన్ ప్రకటించాయి. ఈ సమయానికి చైనాలో వైరస్ ఉధృతి తగ్గుముఖం పట్టింది. వారం రోజులుగా అక్కడ కొత్త కేసు ఒక్కటీ నమోదు కాలేదు.
93వ రోజు (ఏప్రిల్ 2): 10లక్షలకు చేరిన పాజిటివ్లు
ప్రపంచ వ్యాప్తంగా బాధితుల సంఖ్య 10లక్షలు దాటింది. వారిలో 50వేల మందికి పైగా మరణించారు.
99వ రోజు (ఏప్రిల్ 8): 14లక్షలు దాటిన బాధితులు
కరోనా ప్రభావం తీవ్రంగా కనిపించిన కొన్ని యూరప్ దేశాల్లో కొత్త కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టాయి. చైనాలో ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. కరోనా పుట్టినిల్లు వూహాన్లో లాక్డౌన్ను పూర్తిగా ఎత్తివేశారు.