సేవా యాత్రలో సీతక్క వంద రోజులు

ABN , First Publish Date - 2020-07-04T11:37:35+05:30 IST

కరోనా సంక్షోభ సమయంలో పేదలకు ఉచితంగా నిత్యావసరాలు అందించేందుకు ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క చేపట్టిన సేవా యాత్ర వంద

సేవా యాత్రలో సీతక్క వంద రోజులు

ములుగులో మెగా రక్తదాన శిబిరం

అభినందనలు తెలిపిన కలెక్టర్‌, ఏఎస్పీ


ములుగు, జూలై 3: కరోనా సంక్షోభ సమయంలో పేదలకు ఉచితంగా నిత్యావసరాలు అందించేందుకు ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క చేపట్టిన సేవా యాత్ర వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ములుగులో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. స్థానిక మహర్షి విద్యా సంస్థల ప్రాంగణంలో శుక్రవారం జరిగిన కార్యక్రమానికి కలెక్టర్‌ ఎస్‌.కృష్ణఆదిత్య, ఏఎస్పీ సాయిచైతన్య హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న క్రమంలో సర్వత్రా లాక్‌డౌన్‌ విధించగా మారుమూల గ్రామాల్లోని పేద ప్రజలకు సీతక్క నిత్యావసర సరుకులు అందించడం అభినందనీయమని అన్నారు.


ఏఎస్పీ సాయిచైతన్య మాట్లాడుతూ సేవా కార్యక్రమాలకు పోలీసు శాఖ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ తాను విద్యార్థిగా ఉన్న సమయంలో గోదావరి వరద బాధితుల కోసం ప్రజల నుంచి విరాళాలు సేకరించానన్నారు. నేడు ప్రజాప్రతినిధిగా ఆనాటి స్ఫూర్తితో వంద రోజులుగా పేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు.


అనంతరం ఎమ్మెల్యే సీతక్కను పార్టీ నాయకులు గజమాలతో సత్కరించారు. రక్తదానం చేసిన పలువురికి కలెక్టర్‌, ఏఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ జగదీశ్‌, డాక్టర్‌ నారాయణరెడ్డి, రెడ్‌క్రాస్‌ సొసైటీ రాష్ట్ర పాలక మండలి సభ్యుడు ఈవీ.శ్రీనివాస్‌, కె.ప్రసాదరావు, కాంగ్రెస్‌ కిసాన్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు గొల్లపెల్లి రాజేందర్‌గౌడ్‌, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మల్లాడి రాంరెడ్డి, నాయకులు చాంద్‌పాషా, సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-04T11:37:35+05:30 IST