బ్యాంకులకు రూ.లక్ష కోట్లు
ABN , First Publish Date - 2020-03-24T10:15:38+05:30 IST
నిధుల సరఫరా (లిక్విడిటీ) పెంచేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) మరిన్ని చర్యలు...
రెపో రేటుతో రెండు విడతలుగా ఆర్బీఐ అందజేత
త్వరలో కేంద్రం ఉద్దీపన ప్యాకేజీ
నేడో రేపో మంత్రి నిర్మల ప్రకటన
2 లక్షల కోట్లు అడిగిన పరిశ్రమలు
ముంబై: బ్యాంకులకు నిధుల సరఫరా (లిక్విడిటీ) పెంచేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) మరిన్ని చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 16 రోజుల కాలవ్యవధి ఉండే రూ.లక్ష కోట్ల స్వల్పకాలిక రుణాలను 5.16 శాతం రెపో రేటుతో బ్యాంకులకు అందిస్తోంది. ఇందులో రూ.50,000 కోట్ల నిధులను సోమవారమే వేలం వేసింది. మరో రూ.50,000 కోట్లను మంగళవారం వేలం వేస్తోంది. దీనికి తోడు ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా మరో రూ.15,000 కోట్ల ప్రభుత్వ రుణ పత్రాలను మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తోంది.
వ్యవసాయ రుణాలకు ‘ప్రాధాన్యం’ హోదా
ఎన్బీఎస్సీల ద్వారా బ్యాంకులు ఇక వ్యవసాయ, ఎంఎస్ఎంఈ, గృహ రుణాలను అందజేయవచ్చు. ఇలా ఇచ్చే రుణాలను ప్రాధాన్యతా రంగ రుణాలుగా పరిగణించాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఈ మేరకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ రుణా లు ఆయా బ్యాంకుల మొత్తం వార్షిక రుణాల్లో 5 శాతం మించకూడదు.
- వ్యవసాయ రుణాలైతే ఒక్కో వ్యక్తికి ఇచ్చే రుణం రూ.10 లక్షలు మించకూడదు
- ఎంఎస్ఎంఈలకిచ్చే రుణం రూ.20 లక్షలు మించకూడదు.
- రూ.20 లక్షల వరకు ఉండే గృహ రుణాలు ‘ప్రాధాన్యతా’ రుణంగా పరిగణన