ఆర్మీ జవాన్‌ ఖాతా నుంచి లక్ష మాయం

ABN , First Publish Date - 2021-07-03T14:23:06+05:30 IST

కర్ణాటక రాష్ట్రానికి చెందిన అర్మీ జవాన్‌ ఉమేష్‌ బి పాటిల్‌ సికింద్రాబాద్‌ ఏఓసీలో

ఆర్మీ జవాన్‌ ఖాతా నుంచి లక్ష మాయం

  • సైబర్‌క్రైమ్స్‌లో బాధితుడి ఫిర్యాదు


హైదరాబాద్ సిటీ/హిమాయత్‌నగర్‌ : ఆర్మీ జవాన్‌ బ్యాంకు ఖాతా నుంచి వారం రోజుల్లో రూ. లక్ష మాయమయ్యాయి. కర్ణాటక రాష్ట్రానికి చెందిన అర్మీ జవాన్‌ ఉమేష్‌ బి పాటిల్‌ సికింద్రాబాద్‌ ఏఓసీలో పనిచేస్తున్నాడు. అతనికి ఐసీఐసీఐ బ్యాంకులో సేవింగ్‌ అకౌంట్‌ ఉంది. ఇటీవల ఏటీఎంకు వెళ్లి తన ఖాతాలో ఉన్న బ్యాలెన్స్‌ను చెక్‌ చేయగా, రూ.లక్ష తగ్గినట్లు కనిపించింది. దీంతో అతను వెంటనే బ్యాంకుకు వెళ్లి ఖాతా స్టేట్‌మెంట్‌ను తీసుకుని పరిశీలించగా గత నెల 11 నుంచి17 వరకు వారం రోజుల వ్యవధిలో పలు విడతలుగా డబ్బు డెబిట్‌ అయినట్లు ఉంది. తన ప్రమేయం లేకుండా, ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్‌, చెక్కు లావాదేవీలు, ఇతరత్రా మొబైల్‌ చెల్లింపులు కూడా లేకుండా తన డబ్బు ఎలా విత్‌డ్రా అయిందని బ్యాంకు అధికారులను నిలదీసినప్పటికీ వారి నుంచి సరైన సమాధానం రాలేదు. కనీసం అతని మొబైల్‌కు ఎలాంటి మెసేజ్‌లు రాలేదు. దీంతో ఆయన సిటీ సైబర్‌క్రైమ్స్‌లో ఫిర్యాదు చేశాడు. ఐసీఐసీఐ బ్యాంకు అధికారులపై కూడా అతను ఫిర్యాదు చేసినట్లు సిటీ సైబర్‌క్రైమ్స్‌ ఏసీపీ కేవీఎం. ప్రసాద్‌ తెలిపారు.

Updated Date - 2021-07-03T14:23:06+05:30 IST