త్వరలో మరో ఉద్దీపన!

ABN , First Publish Date - 2020-10-22T06:38:40+05:30 IST

దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతుండడంతో పాటు ఆర్థిక వ్యవస్థలో సానుకూల సంకేతాలు కూడా వెలువడుతున్నందు వల్ల మరో ఉద్దీపన ప్యాకేజి పై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది...

త్వరలో మరో ఉద్దీపన!

  • ఆరు నెలల్లో మూడో ప్యాకేజ్‌


న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతుండడంతో పాటు ఆర్థిక వ్యవస్థలో సానుకూల సంకేతాలు కూడా వెలువడుతున్నందు వల్ల మరో ఉద్దీపన ప్యాకేజి పై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి తరుణ్‌ బజాజ్‌ సీఐఐ సదస్సులో మాట్లాడుతూ ఈ అంశ తెలిపారు. కొత్త ప్యాకేజిలో ఏయే అంశాలు చేర్చాలి, ఏ రంగానికి ఎంత మద్దతు అవసరం అనే విషయమై ఇప్పటికే వివిధ మంత్రిత్వ శాఖల నుంచి సలహాలు అందాయని ఆయన చెప్పారు. తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి తాము ఏమేమి చేయగలమో తాము పరిశీలిస్తున్నామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన ప్రకటనకు కొనసాగింపుగా ఈ కసరత్తు జరుగుతున్నదని ఆయన అన్నారు.


పారిశ్రామిక రంగాన్ని, వలస కార్మికులను కొవిడ్‌ కష్టాల నుంచి కాపాడేందుకు ఆత్మనిర్భర్‌ భారత్‌, పీఎం గరీబ్‌ కల్యాణ్‌ యోజన పేరిట ప్రభుత్వం ఇప్పటికే రెండు ప్యాకేజిలు  ప్రకటించింది. ఇది మూడో ప్యాకేజి.  కాగా ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకానికి (పీఎల్‌ఐ) పరిశ్రమ నుంచి  మంచి స్పందన రావడంతో దాన్ని మరో ఏడెనిమిది రంగాలకు విస్తరించాలని యోచిస్తున్నట్టు ఆయన తెలిపారు. ప్రపంచ తయారీ గమ్యంగా భారత్‌ను తయారుచేసి తద్వారా భారీ ఎగుమతి మార్కెట్‌తో పాటు విస్తారమైన దేశీయ మార్కెట్‌ను కూడా అందుబాటులో ఉంచాలనుకుంటున్నట్టు చెప్పారు.

Updated Date - 2020-10-22T06:38:40+05:30 IST