కరోనా నేపథ్యంలో కిలో ఉల్లిపాయలు ఎంతంటే...
ABN , First Publish Date - 2020-03-27T12:55:05+05:30 IST
ఉల్లి ధర ఒక్కసారిగా పెరిగింది. శనివారం వరకు కిలో
- వేలంలో కిలో రూ. 33
- నాలుగు రోజుల తర్వాత తెరుచుకున్న మలక్పేట మార్కెట్
హైదరాబాద్ : ఉల్లి ధర ఒక్కసారిగా పెరిగింది. శనివారం వరకు కిలో రూ. 20 పలకగా మలక్పేటలోని హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్లో గురువారం జరిగిన వేలంలో నాణ్యమైన మొదటి రకం ఉల్లి కిలో రూ. 33 పలికింది. ఇటు వ్యాపారులను, అటు వినియోగదారులను బెంబెలెత్తించింది. గత ఆదివారం నుంచి బుధవారం వరకు మలక్పేట మార్కెట్ మూతపడింది.
ఆదివారం జనతా కర్ఫ్యూ, సోమవారం మార్కెట్లో కరోనా వైరస్ నివారణకు శానిటైజేషన్ కోసం, మంగళవారం అమావాస్య కావడంతో సంప్రదాయం ప్రకారం మార్కెట్ను మూసివేయడం, బుధవారం ఉగాది కావడంతో మార్కెట్ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు మార్కెట్ కమిటీ అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల తర్వాత తెరచుకున్న మార్కెట్కు 14 లారీల ద్వారా 1,400 క్వింటాళ్ల మేర ఉల్లి చేరుకుంది. వేలం పాటలో నాణ్యమైన ఉల్లి మొదటి రకం ధర కిలో రూ.33 పలకగా, రెండో రకం ధర కిలో రూ. 30, మూడో రకం కిలో రూ. 24 పలికింది. మరో రెండు రోజుల్లో ఉల్లి మార్కెట్కు చేరితే కిలో రూ. 20 చేరే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు.