ఆ 1000 కోట్లు ఏమయ్యాయి?

ABN , First Publish Date - 2020-09-24T09:28:30+05:30 IST

హైదరాబాద్‌లో వెలుగుచూసిన రూ.1000 కోట్ల చైనా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ల వ్యవహారం ద్వారా ప్రధానంగా ఎవరెవరు లబ్ధి పొందారనే

ఆ 1000 కోట్లు ఏమయ్యాయి?

చైనా బెట్టింగ్‌ యాప్‌ల లావాదేవీలపై ఈడీ దర్యాప్తు


న్యూఢిల్లీ, సెప్టెంబరు 23 : హైదరాబాద్‌లో వెలుగుచూసిన రూ.1000 కోట్ల చైనా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ల వ్యవహారం ద్వారా ప్రధానంగా ఎవరెవరు లబ్ధి పొందారనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ప్రకటించింది. పేటీఎం, హెచ్‌ఎ్‌సబీసీ బ్యాంకు ఖాతాల ద్వారా అక్రమంగా ఎవరెవరికి నిధులు మళ్లాయి అనేది తెలుసుకోవడంపై దృష్టి సారించినట్లు తెలిపింది. చైనా జాతీయులు స్థాపించిన డాకీ పే టెక్నాలజీ, లిన్‌క్యున్‌ టెక్నాలజీ కంపెనీల ద్వారా ఈ స్కామ్‌ జరిగిందని వెల్లడించింది. ఈ-కామర్స్‌ ముసుగులో వందలాది వెబ్‌సైట్లను సృష్టించి, వాటి ద్వారా అధిక లాభాల ఆశచూపి అమాయక యువతను సభ్యులుగా మార్చుకొని .. పలు యాప్‌లలోని గేమ్‌లపై బెట్టింగ్‌ కట్టించారని వివరించింది.


ఈక్రమంలో బెట్టింగ్‌ చేసే వారి నుంచి డబ్బుల వసూలుకు, వారికి తిరిగి కమిషన్లు చెల్లించేందుకు పేటీఎం, క్యాష్‌ ఫ్రీ యాప్‌లను వేదికగా వాడుకున్నారని ఈడీ పేర్కొంది. ఇక ఈ వ్యవహారంలో చైనా జాతీయుడు యాన్‌ హో, భారత్‌లో అతడికి సహకరించిన ధీరజ్‌ సర్కార్‌, అంకిత్‌ కపూర్‌లను సెప్టెంబరు 15నే ఈడీ అరెస్టు చేసింది. ఆ ముగ్గురిని ఎనిమిది రోజులపాటు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ హైదరాబాద్‌లోని మనీలాండరింగ్‌ వ్యవహారాల ప్రత్యేక కోర్టు మంగళవారం ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ నిందితులు సూక్ష్మ రుణాల వ్యాపారాన్ని ప్రారంభించేందుకుగానూ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎ్‌ఫసీ) లైసెన్సుకు దరఖాస్తు చేసుకోగా సంబంధిత నియంత్రణ సంస్థలు తిరస్కరించాయని ఈడీ వెల్లడించడం గమనార్హం. 

Updated Date - 2020-09-24T09:28:30+05:30 IST