ఆన్‌లైన్‌లో పరిచయం.. కుర్రాడి ఇంటికి వెళ్లిపోయిన యువతి.. కొద్ది గంటల్లో పెళ్లనగా అనూహ్య ట్విస్ట్..!

ABN , First Publish Date - 2021-10-12T19:27:18+05:30 IST

సోషల్ మీడియాలో స్నేహితులుగా పరిచయమై.. ఆ తర్వాత ప్రేమ.. పెళ్లి.. ఇలాంటి వార్తలు ఈ మధ్య తరచూ చూస్తూనే ఉన్నాం. ఇలా ప్రేమించి పెళ్లి చేసుకున్న బంధాలు కొన్ని మధ్యలోనే తెగిపోతున్నాయి. సోషల్ మీడియా స్నేహాలను

ఆన్‌లైన్‌లో పరిచయం.. కుర్రాడి ఇంటికి వెళ్లిపోయిన యువతి.. కొద్ది గంటల్లో పెళ్లనగా అనూహ్య ట్విస్ట్..!

సోషల్ మీడియాలో స్నేహితులుగా పరిచయమై.. ఆ తర్వాత ప్రేమ.. పెళ్లి.. ఇలాంటి వార్తలు ఈ మధ్య తరచూ చూస్తూనే ఉన్నాం. ఇలా ప్రేమించి పెళ్లి చేసుకున్న బంధాలు కొన్ని మధ్యలోనే తెగిపోతున్నాయి. సోషల్ మీడియా స్నేహాలను నమ్మి మోసపోవద్దని పోలీసులు చెబుతూనే ఉన్నా ఇంకా అలాంటి పెళ్లిళ్లు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ జంట కూడా పెళ్లికి సిద్ధమయింది. ఆ బాలిక కూడా ఇంటి నుంచి పెళ్లి కోసం ఆ కుర్రాడి ఇంటికి చేరుకుంది. కానీ ఇంతలోనే ఊహించని ట్విస్ట్ వీళ్ల కథలో జరిగింది..


ఒడిశాకు చెందిన ఓ బాలిక తొమ్మిదో తరగతి వరకు చదువుకుంది. అయితే ఆమె ఫోన్‌లో ఎక్కువగా ఆన్‌లైన్ లూడో గేమ్ ఆడుకునేది. గేమ్‌ ఆడే క్రమంలో ఆమెకు పానిపట్‌కు చెందిన 20 ఏళ్ల కుర్రాడితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ యువకుడు తన కుటుంబసభ్యుల అనుమతి తీసుకొని బాలికను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. ఆ బాలిక ఒడిశా నుంచి పానిపట్‌‌కు చేరుకుంది. సోమవారం వీరిద్దరూ పెళ్లికి అంతా రెడీ చేసుకున్నారు. 


అంతలోనే బాల్య వివాహం జరుగుతున్నట్లు రహస్యంగా సమాచారం అందుకున్న చైల్డ్ వెల్ఫేర్ బృందం అక్కడికి చేరుకుని పెళ్లి జరగకుండా అడ్డుకుంది. చట్ట ప్రకారం వివాహ సమయానికి అబ్బాయిల వయసు 21, అమ్మాయి వయసు 18 ఏళ్లు ఉండాలి. కానీ యువకుడి వయసు ఆధార్ కార్డు ప్రకారం 20 సంవత్సరాల 8 నెలలు. కుటుంబసభ్యుల స్టేట్‌మెంట్ తీసుకుని ప్రస్తుతానికి పెళ్లిజరగకుండా ఆపారు. అయితే బాలిక తరపున పెళ్లికి ఎవరూ రాలేదు. ఆఫీసర్ రజనీ గుప్తా మాట్లాడుతూ.. యువకుడి కుటుంబం పానిపట్‌లోని సనైలి రోడ్‌ మురికి వాడలో నివాసముంటున్నారని తెలిపారు. కుర్రాడికి నలుగురు తమ్ముళ్లు కూడా ఉన్నారని అన్నారు. అబ్బాయి ఇంటివద్దే సోమవారం పెళ్లికి ఏర్పాట్లు చేసుకున్నారని, కానీ వారిది బాల్యవివాహం కావడంతో తాము అడ్డుకున్నామని వివరించారు. అక్టోబర్ 2న బాలిక తన అక్కతో చెప్పి ఇంట్లోనుంచి వచ్చేసి కుర్రాడి వద్దే ఉంటుందని అన్నారు. బాలిక తండ్రి చనిపోవడంతో వారి కుటుంబం బిహార్ నుంచి ఒడిశాకు మారింది. ఆమె తల్లి ఈ పెళ్లికి ఒప్పుకోలేదని రజనీ అన్నారు.  తొమ్మిదో తరగతి వరకు చదువుకుని ఆపేసిన ఆ బాలిక వయసుకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నామని తెలిపారు.

Updated Date - 2021-10-12T19:27:18+05:30 IST