యాభై శాతం పెరిగిన ఆన్లైన్ లావాదేవీలు...
ABN , First Publish Date - 2021-04-05T21:42:21+05:30 IST
చెల్లింపులకు సంబంధించి ఆన్లైన్ వినియోగం 50 శాతం మేర పెరిగినట్లు ఎస్బీఐ కార్డ్ అండ్ పేమెంట్ సర్వీసెస్ వెల్లడించింది. కరోనా నేపధ్యంలో వినియోగదారులు పెద్దసంఖ్యలో యూపీఐ పేమెంట్ యాప్స్, ఆన్లైన్ చెల్లింపుల వేపు మొగ్గు చూపుతోన్న విషయం తెలిసిందే.
బెంగళూరు : చెల్లింపులకు సంబంధించి ఆన్లైన్ వినియోగం 50 శాతం మేర పెరిగినట్లు ఎస్బీఐ కార్డ్ అండ్ పేమెంట్ సర్వీసెస్ వెల్లడించింది. కరోనా నేపధ్యంలో వినియోగదారులు పెద్దసంఖ్యలో యూపీఐ పేమెంట్ యాప్స్, ఆన్లైన్ చెల్లింపుల వేపు మొగ్గు చూపుతోన్న విషయం తెలిసిందే. గతేడాది కాలంగా ఈ చెల్లింపులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. ఎస్బీఐ కార్డ్ ద్వారా జరిగే చెల్లింపుల్లో గతంలో ఆన్లైన్ చెల్లింపులు 44 శాతం కాగా, ఇప్పుడు 53 శాతానికి చేరడం గమనార్హం.
కరోనా నేపధ్యంలో ఆన్లైన్ చెల్లింపుల దిశగా మొగ్గు పెరుగుతోంది. నిత్యావసర వస్తువులు, ఇతర ఉత్పత్తులను ఆన్లైన్ చెల్లింపుల ద్వారా కొనుగోలు చేస్తున్నారు. విద్యుత్తు, డీటీహెచ్, కేబుల్ టీవీ వంటి యుటిలిటీ బిల్లులతో పాటు బీమా ప్రీమియంలను కూడా ఆన్లైన్ ద్వారా చెల్లించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
ఇక ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ మరోసారి ఆందోళనకు గురి చేస్తోంది. దీంతో రానున్న రోజుల్లో ఆన్లైన్ చెల్లింపులు మరింత పెరిగే అవకాశముందని ఎస్బీఐ కార్డ్ ఎండీ, సీఈవో రామ్మోహన్ రావు చెబుతున్నారు .
కాగా రానున్న రోజుల్లో ఆన్లైన్ చెల్లింపులు మరింతగా పెరుగుతాయని భావిస్తున్నారు. ఒకసారి ఆన్లైన్ చెల్లింపులకు అలవాటు పడితే కరోనా అనంతరం కూడా వాటికే మొగ్గు చూపుతున్నారరి చెబుతున్నారు. అయితే ఇది ప్రజల కొనుగోలు ప్రవర్తనపై ఏమైనా ప్రభావం చూపుతుందా అనే విషయం చెప్పలేమన్నారు. దుకాణాలు, మాల్స్ పూర్తిస్థాయిలో తెరుచుకుంటే పీఓఎస్ చెల్లింపులు పుంజుకుంటాయని ఎస్బీఐ కార్డ్ భావిస్తోంది.
చిన్న చిన్న నగరాలు కూడా...
కరోనాకు ముందువరకు ఆన్లైన్ చెల్లింపుల్లో మెట్రో నగరాలది పెద్ద పాత్ర. కానీ కరోనా అనంతరం సీన్ మారిపోయింది. చిన్న నగరాల్లో వినియోగదారులు ఆన్లైన్ చెల్లింపులకు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం కొత్తగా చేరుతున్న ఖాతాదారుల్లో 58 శాతం మంది నాన్ మెట్రో నగరాల నుండి వస్తున్నారు. రోజుకు సగటున కరోనాకు ముందుస్థాయిలో మాదిరిగా పది వేల మంది కొత్త ఖాతాదారులను సంపాదిస్తున్నట్లు వెల్లడించారు.