ఆ ఐదుగురే దిక్కు.. జనరల్ ఆస్పత్రికి పెరుగుతున్న రోగులు.. తగ్గుతున్న వైద్యులు
ABN , First Publish Date - 2020-08-10T17:28:44+05:30 IST
మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి రోగుల తాకిడి పెరిగింది. ఓపీ కేసులు బయట చూడకపోవడంతో ఉమ్మడి జిల్లాతో పాటు, వికారాబాద్ జిల్లా రోగులు ఇక్కడికే వస్తున్నారు. కరోనా వైరస్
40 మంది కొత్త ఎస్ఆర్ డాక్టర్లకు జాయిన్ అయ్యింది 7 మందే
రిజైన్ చేసి వెళ్లిన 27 మంది జూనియర్ డాక్టర్లు
మహబూబ్నగర్ (వైద్య విభాగం): మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి రోగుల తాకిడి పెరిగింది. ఓపీ కేసులు బయట చూడకపోవడంతో ఉమ్మడి జిల్లాతో పాటు, వికారాబాద్ జిల్లా రోగులు ఇక్కడికే వస్తున్నారు. కరోనా వైరస్ కూడా తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందడంతో పాజిటివ్ రోగులు కూడా ఈ ఆస్పత్రిలోనే చేరుతున్నారు. ఈ నేపథ్యంలో గడిచిన నెల రోజుల్లో ఓపీ సంఖ్య విపరీతంగా పెరిగింది.
ఉన్నది ఐదుగురు డాక్టర్లే: ఆస్పత్రిలో మామూలుగా వచ్చే రోగాలతో పాటు కరోనా రోగులకు వైద్య సేవలందించే జనరల్ ఫిజీషియన్ డాక్టర్లు ఐదుగురే ఉన్నా రు. జనరల్ మెడిసిన్ విభాగంలో ఒక ప్రొఫెసర్, ఒక అసోసియేట్ ప్రొఫెసర్, నలు గురు మత్తు డాక్టర్లు ఉన్నారు. ఇద్దరు ప్రొఫెసర్ డాక్టర్లు పర్యవేక్షణ చేయడంతో పాటు ఇతర రిపోర్టులు పంపిస్తారు. మిగతా నలుగురు మత్తు డాక్టర్లు గైనిక్ విభాగంలో డెలివరీలు చేస్తున్నారు. దీంతో పాటు పల్మనరీ విభాగంలో కేవలం ఒక్క డాక్టరే ఉన్నారు. ప్రస్తుతం కరోనా నేపథఽ్యంలో వీరి పాత్ర చాలా కీలకం. జనరల్ ఫిజీషియన్ డాక్టర్లతోనే ఆ విభాగం నడుస్తోంది.
పని భారంతో ఇబ్బందులు: జనరల్ మెడిసిన్ విభాగంలో ఉన్న ఐదు మంది డాక్టర్లే కరోనా పాజిటివ్ రోగులకు, జనరల్ ఓపీ, క్యాజువాలిటీకి వచ్చే అత్యవసర కేసులు, ఐసీయూ కేసులకు, వార్డులలో సేవలు అందించాల్సి రావడంతో వారిపై పనిభారం పడుతోంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా కుటుంబాలను వదిలి పెట్టి విధుల్లో ఉండటంతో అనారోగ్యం బారిన పడడంతో పాటు మానసికంగా, శారీరకంగా మనోవేదనను అనుభవిస్తున్నారు.
40 మంది డాక్టర్లకు 7 మందే జాయిన్: కరోనా నేపథ్యంలో వారం కిందట ప్రభుత్వం జిల్లాకు 40 మంది సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల నియామకాలను చేప ట్టింది. అయితే చాలా మంది పైరవీలు చేసి, హైదరాబాద్లోనే పోస్టింగ్ వేయిం చుకున్నారు. జిల్లాలో మాత్రం 7 మంది డాక్టర్లు మాత్రమే జాయిన్ అయ్యారు. వీరు కూడా కొవిడ్ ఆస్పత్రిలో పని చేయడానికి ఆసక్తి చూపడం లేదు. మిగిలిన డాక్టర్లు వస్తారో.. రారో తెలియని పరిస్థితి ఉంది. ఆస్పత్రిలో ఈ ఏడాది జనవరిలో 31 మంది జూనియర్ డాక్టర్లను నియమించారు. కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందడం, ఆస్పత్రికి రోగుల సంఖ్య పెరగడంతో ఇటీవల ఒకేసారి 27 మంది డాక్టర్లు రిజైన్ చేసి వెళ్లిపోయారు. మిగిలిన నలుగురిని క్యాజువాలిటీ డాక్టర్లుగా కొనసాగిస్తున్నారు.
ఉన్నతాధికారులకు నివేదించాం: డా. రాంకిషన్, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్
జనరల్ ఆస్పత్రిలో జనరల్ ఫిజీషియన్ డాక్టర్ల కొరత ఉన్న మాట వాస్తవమే. ఈ కొరతపై ఉన్నతాధికారులకు నివేదిస్తూనే ఉన్నాం. కానీ ఈ పరిస్థితుల్లో కొత్త డాక్టర్లు రావడానికి ఆసక్తి చూపడం లేదు. అయినప్పటికీ ఉన్న డాక్టర్లతో రోగులకు వైద్య సేవలు అందిస్తున్నాం. మిగిలిన విభాగాల డాక్టర్లకు కూడా డ్యూటీలు వేసి, రోగులకు ఇబ్బందులు కలుగకుండా చూస్తున్నాం. కొత్త డాక్టర్లు త్వరలో వచ్చే అవకాశం ఉంది.