ఒకే ఒక్కడు!
ABN , First Publish Date - 2022-01-29T05:17:46+05:30 IST
ఒకే ఒక్కడు!
- జడ్పీ సమావేశానికి హాజరు ఫ కొవిడ్ పేరుతో సభ్యుల డుమ్మా
- కోరం లేదని సమావేశం వాయిదా
రంగారెడ్డి అర్బన్, జనవరి 28 : జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశానికి సభ్యులంతా డుమ్మా కొట్టారు. కొవిడ్ మహమ్మారి పేరుతో ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు హాజరు కాలేదు. కందుకూరు జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి ఒక్కరే సమావేశానికి హాజరయ్యారు. ఉదయం 11గంటలకు నిర్వహించాల్సిన సమావేశానికి జడ్పీ చైర్పర్సన్ తీగల అనితాహరినాథ్రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్, జిల్లా పరిష్ ముఖ్యకార్యనిర్వహణ అధికారి దిలీ్పకుమార్ హాజరయ్యారు. సభ్యల రాకకోసం ఎదురు చూశారు. కందుకూరు జడ్పీటీసీ జంగారెడ్డి మినహా మిగతా వారు రాకపోవడం ఆశ్చర్యం కలిగించింది. తన మండలంలో అనేక సమస్యలు ఉన్నాయని.. సమస్యలను ప్రస్తావించేందుకు సమావేశానికి వస్తే... ఇదేం పరిస్థితని జంగారెడ్డి ప్రశ్నించారు. అరగంట వరకు వేచి చూసి సభ్యులెవరూ హాజరు కాకపోవడంతో కోరం లేనందున సమావేశాన్ని వాయుదా వేస్తున్నట్లు చైర్పర్సన్ ప్రకటించారు. ఈ సమావేశానికి సభ్యులంతా అనుకుని ఒకేసారి హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో జడ్పీ చైర్పర్సన్ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా కొవిడ్ కారణంగా సభ్యులు రాలేక పోయారని సమాధానమిచ్చారు. ఎంతమంది సభ్యులకు కొవిడ్ వచ్చిందని అడగ్గా... ఒకరిద్దరికి వచ్చిందని, మిగతా సభ్యుల్లోని కుటుంబ సభ్యులకు రావడంతో రాలేకపోయారని ఆమె తెలిపారు. ఈ సమావేశానికి హాజరైన అధికారులంతా మధ్యాహ్నం వరకు ఉండి ఆ తర్వాత తిరిగి వెళ్లిపోయారు.