ఒడిశా కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ...

ABN , First Publish Date - 2021-10-22T18:45:39+05:30 IST

ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఓపీసీసీ) వర్కింగ్ ప్రెసిడెంట్,

ఒడిశా కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ...

భువనేశ్వర్ : ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఓపీసీసీ) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ ప్రదీప్ మాఝీ ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి శుక్రవారం రాజీనామా చేశారు. ఆ పార్టీలో ఉత్తేజం కొరవడిందన్నారు. ఆయన త్వరలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీలో చేరబోతున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది పంచాయతీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఆయన రాజీనామా కాంగ్రెస్‌కు శరాఘాతమని విశ్లేషకులు చెప్తున్నారు. 


కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ప్రదీప్ పంపించిన రాజీనామా లేఖలో, తాను పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని, ఈ విషయాన్ని అత్యంత విచారం, బాధతో తెలియజేస్తున్నానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ప్రజలకు సేవ చేయాలని కోరుకున్నానని, అయితే కాంగ్రెస్‌లో ఉత్తేజం కొరవడిందని చెప్పారు. 


‘‘మీ చురుకైన నాయకత్వంలో పార్టీని చాలా బాగా నిర్వహించారు, అయితే సహకరించడానికి మొండిగా నిరాకరించే వ్యక్తులు వివిధ స్థాయుల్లో  కీలక స్థానాలను ఆక్రమించుకోవడం వల్ల కాంగ్రెస్ నానాటికీ క్షీణిస్తోంది. ప్రస్తుతం పార్టీ విశ్వసనీయతను కోల్పోయింది. తిరిగి నమ్మకాన్ని సాధించాలంటే చాలా కాలం పడుతుంది’’ అని పేర్కొన్నారు. 


తాను ఏ స్థానంలో ఉన్నా తన ప్రజలకు సేవ చేయాలని తనకు గొప్ప కోరిక ఉందని, ఈ కోరిక కాంగ్రెస్ పార్టీలో కొరవడిందన్నారు. ‘‘మీ సిద్ధాంతాల ప్రకారం నేను నా విధులను నిర్వహిస్తాను, ప్రజలకు సంతృప్తికరంగా సేవలందిస్తాను’’ అని పేర్కొన్నారు. 


ప్రదీప్ ఒడిశాలోని నబరంగ్‌పూర్‌ లోక్‌సభ సభ్యునిగా 2009లో గెలిచారు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో పరాజయం చవి చూశారు.  ఆయన సన్నిహితుల కథనం ప్రకారం, ఆయన త్వరలోనే బీజేడీలో చేరబోతున్నారు. ఈ నెలలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నబరంగ్‌పూర్‌లో పర్యటిస్తారని, ఆయన సమక్షంలో ప్రదీప్ బీజేడీలో చేరుతారని తెలుస్తోంది. 


Updated Date - 2021-10-22T18:45:39+05:30 IST