ఓటుకు నోటు కేసులు చాలా నమోదవుతున్నాయి.. కానీ నా ఒక్క కేసే పీసీ యాక్ట్‌లో ఎందుకు.?: రేవంత్ రెడ్డి

ABN , First Publish Date - 2021-10-25T08:06:28+05:30 IST

చిన్నప్పటి నుంచి మా గ్రామంలో, మా కుటుంబంలో ఉన్న పరిస్థితుల కారణంగా నాకు అలవాటు కాలేదు. ఇప్పుడు నాయకుడయ్యాక పది మంది దృష్టిలో గౌరవంగా..

ఓటుకు నోటు కేసులు చాలా నమోదవుతున్నాయి.. కానీ నా ఒక్క కేసే పీసీ యాక్ట్‌లో ఎందుకు.?: రేవంత్ రెడ్డి

ఆర్కే: తెలంగాణ సమాజంలో మందు తాగడం పెద్ద విషయమేమీ కాదు కదా?

రేవంత్‌: చిన్నప్పటి నుంచి మా గ్రామంలో, మా కుటుంబంలో ఉన్న పరిస్థితుల కారణంగా నాకు అలవాటు కాలేదు. ఇప్పుడు నాయకుడయ్యాక పది మంది దృష్టిలో గౌరవంగా ఉండాలన్న ఆలోచనతో ఉన్నాను. అనవసర విషయాలకు ఫోన్‌ వినియోగాలే పెరిగిపోయాయి. ఎంతో మంది నాయకుల ఫోన్‌ కాల్‌ రికార్డులు బయటకొస్తున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా నమ్మకంలేని పరిస్థితుల్ని కేసీఆర్‌ సృష్టించారు. కేసీఆర్‌ ఏం చేస్తారో తెలియదుగానీ.. కాంగ్రెస్‌ జెండా కప్పుకొని చచ్చిపోతానన్నవారిని, టీడీపీ జెండా కప్పుకొని చచ్చిపోతానన్న వారిని గంటలోపే తీసుకెళ్లి టీఆర్‌ఎస్‌ కండువా కప్పుతారు. 


ఆర్కే: ఏం చేస్తారో తెలియదా? (నవ్వుతూ)

రేవంత్‌: ఎవరి గురించేమోగానీ.. మండవ వెంకటేశ్వర్‌రావు టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకొంటే రెండు రోజులు నాకు బాధ కలిగింది. ఇలాంటివాళ్ల ఎత్తులు, జిత్తుల నుంచి తప్పించుకోవడం తేలిక కాదు. తెలంగాణ పోరాట తత్వాన్ని దిగజార్చారు. వందల ఏళ్లు తెలంగాణకు ఉన్న డీఎన్‌ఏను చంపేసి వ్యవస్థలను, వ్యక్తులను సర్వనాశనం చేశారు. ఈ క్షణమే ఆయనను ఓడించి అడవులకు పంపిస్తే బాగుండునన్నంత కసి ఉంది.


ఆర్కే: రేవంత్‌రెడ్డి పిలక కేసీఆర్‌ చేతిలో ఉందని షర్మిల అన్నారు. ఓటుకు నోటు కేసులో ఏమైనా చేస్తే?

రేవంత్‌: ఎవరైనా చట్ట పరిధిలో ఉండాల్సిందే. సర్పంచ్‌ నుంచి ఎంపీ దాకా ఓట్లు వేయాలంటూ ఓటర్లకు డబ్బులిస్తున్నట్లు కేసులు నమోదవుతున్నాయి. ఈ కేసులేవీ పీసీ యాక్ట్‌ కిందికి రాకుండా నా ఒక్క కేసే ఎందుకు పోయింది?


ఆర్కే: నీ ఎదుగుదలకు ప్రమాదం లేదా?

రేవంత్‌: ఏమీ లేదు. కోర్టు పరిధిలో ఉంది. కేసీఆర్‌ ఎవరి శరణుజొచ్చినా చరిత్ర, కాలం సమాధానం చెబుతాయి. షర్మిల సొంత అన్నపై ఉన్న లెక్కలేనన్ని కేసుల గురించి మాట్లాడకుండా నా కేసు గురించి మాట్లాడితే ప్రయోజనం లేదు. తెలంగాణలో ఆమె పార్టీ నిలదొక్కుకోవాలంటే ముందుగా ఏపీతో జల వివాదాలపై మాట్లాడాలని సూచిస్తున్నాను. 


ఆర్కే: రెండు రాష్ట్రాలు కలిసి తమ పిలకను కేంద్రం చేతిలో పెట్టాయి. షర్మిల తెలంగాణలో అడుగు పెట్టడం వల్లే కేసీఆర్‌ ఈ పరిస్థితికి కారణమయ్యారని అనుకోవచ్చు కదా?

రేవంత్‌: చంద్రబాబు ఏపీ సీఎంగా ఉన్నప్పుడే కేసీఆర్‌ ఈ ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే ఇప్పుడు అక్రమ ప్రాజెక్టులు అనాల్సిన అవసరం ఉండకపోయేది. తెలంగాణకు కేసీఆర్‌ చేసిన ద్రోహం ఇది.


నేను టీ-కాంగ్రెస్ ప్రెసిడెంట్ కావడానికి కేసీఆరే కారణం: రేవంత్ రెడ్డి (part 1)

Updated Date - 2021-10-25T08:06:28+05:30 IST